Thursday, May 14, 2009

పెరుగుతున్న సంఘాలు – తరుగుతున్న భాష

Thursday, May 14, 2009

తెలుగు సంఘాల పేరులో ముఖ్యమైన పదం, వాటి ఉనికికి మూలం. వాటి సభ్యుల, దాతల, నాయకుల మాతృభాష తెలుగు. (1) సుమారు 6,700 ప్రపంచ భాషల్లో, మాట్లాడేవారు సంఖ్యాపరంగా 15వ స్థానంలో, (2) భాషలలో 3వ స్థానంలో ఉన్న భాష తెలుగు.


ఉత్తర అమెరికాలో తెలుగు


1971 లో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఉత్తర అమెరికాలో ఏర్పడ్డ మొట్టమొదటి తెలుగు సంఘం (శ్రీ చెరుకుపల్లి నెహ్రూ). అప్పటినుండి, ఇప్పటి దాకా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. అమెరికాలోని ఉద్యోగావకాశాల వలన తెలుగువారి సంఖ్య 100,000 దాటిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరిన్ని తెలుగు సంఘాలు ఏర్పడవచ్చు. ఉత్తరమెరికాలోని తెలుగు సంఘాల సంఖ్య 100 కావచ్చు. అటువంటి తెలుగువారు ప్రవాసంలో కూడా తెలుగు కావాలని, సంఘాలు పెట్టుకోవడమే కాకుండా, తెలుగు నేర్పే ‘బడులు’ పెట్టుకున్నారు. పత్రికలు మొదలుపెట్టారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3,000 పుస్తకాలలో నడపబడ్డ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం వారి గ్రంథాలయం ముఖ్యమైనది.


గత ముప్పై ఏళ్ళల్లో (1) ‘తెలుగు భాషా పత్రిక’ (శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో) నుండి నేటి వరకు చాలా తెలుగు పత్రికలు వచ్చినా (2) ‘తెలుగు జ్యోతి’ (శ్రీ కిడంబి రఘునాథ్), (3) తానా పత్రిక (శ్రీ జంపాల చౌదరి) (4) అమెరికా భారతి (శ్రీ చందూరి మురళి) పత్రికలు, (5) వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు (శ్రీ వంగూరి చిట్టెంరాజు) మరియు ఇంటర్నెట్ పత్రిక (6) ‘ఈ మాట’ (శ్రీ కెవియస్ రామారావు) అమెరికాలో తెలుగులో వ్రాసేవారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.


‘క’కార ప్రాస కుదిరింది కదా అని కవిత్వాలు వ్రాసే వారు మాత్రమే కాక, కథలు, సంప్రదాయ కవిత్వం, నాటకాలు, విమర్శలు, అనువాదాలు, కావ్యరచన చేసిన వారు (శ్రీయుతులు వేమూరి వేంకట రామనాథం, కృష్ణదేశికాచారి) కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ మొదటి తరంవారికి మాత్రమే పరిమితం. మొదటి తరం తెలుగు వారు తెలుగు మాట్లాడగలిగినా, రాను రాను వారి తెలుగు వాడకం తగ్గుకుంటూ వచ్చింది. వారి పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల మాట్లాడినా పెద్దవారయ్యేసరికి వారి తెలుగు క్షీణించిపోతుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్దిమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి తెలుగు నేర్చుకుంటారు.


భాష గురించి ఎందుకు ఆలోచించాలి?


భాష ఒకరితో ఒకరు నిత్య అవసరాలని తీర్చుకునేందుకు వాడుకునే పనిముట్టుగా మాత్రమే కాదు, ఒక జాతి వారి లక్షణాలని, ఆలోచనా విధానాన్ని, జీవన సరళిని, మేధా సంపత్తిని, ఒక తరం నుండి మరో తరానికి అందించే అతి ముఖ్యమైన మానవ పరిణామ ప్రక్రియ మూలమంత్రం. ఈ దృష్టితో చూసినపుడు భాషకు ఉన్న అతి ముఖ్యమైన విలువని గ్రహించగలం. ఒక భాష మరుగునపడిపోతే, దానితోపాటు ఆ భాషలోని సాహిత్యం, ఆ సాహిత్యంతో పాటు ఆ జాతి మేధా సంపత్తి పోయినట్టే. మానవ నిర్లక్ష్యం వల్ల పోయిన భాషల వల్ల జరిగిన నష్టాన్ని లెక్కకట్టడం సాధ్యం కాకపోయినా, రెండు మూడు భాషలు బాగా తెలిసినవారు ఊహించవచ్చు, గ్రహించవచ్చు.


‘వాడుకోండి, లేదా వదులుకోండి?’ అన్నది భాషకున్న ఓ ముఖ్య లక్షణం. సుమారు గత 40 ఏళ్ళుగా విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం వారి ఆధ్వర్యంలో నడవబడుతున్న ఏకైక తెలుగు తెలుగు బోధన (శ్రీ వెల్చేరు నారాయణరావు) విద్యార్థులు లేని కారణంగా నిలిచిపోయింది. ఇది చాలా శోచనీయమైన విషయం (సంపాదకీయం, తానా పత్రిక, మే, 2001) (7).


భాష ఎలా చనిపోతుంది? యుద్ధాలలో ఓడిపోయిన వారి భాష నిషేధించబడడం. ఒక తెగ మరో తెగని పూర్తిగా అంతం చెయ్యడం, అప్పుడప్పుడు ప్లేగు వంటి జబ్బులు వచ్చి తెగ మొత్తం నాశనమైపోవడం వలన చాలా భాషలు అంతరించాయి. కానీ ప్రస్తుతం భాషలు చనిపోవడానికి ముఖ్య కారణం ఆ భాష మాట్లాడే వారికి ఆ బాష పట్ల ఉన్న నిర్లక్ష్యమే అని భాషా శాస్త్రజ్ఞులు గమనించారు. (8)


అమెరికాలో తెలుగు భాష ఎలా బ్రతుకుతుంది?

ఏ భాష నేర్చుకుంటే సంపాదన అవకాశాలు ఎక్కువ అవుతాయో ఆ భాష చక్కగా, పచ్చగా జీవిస్తుంది. ఇది అందరికి తెలిసినదే. తరతరాలుగా రుజువైనదే. డబ్బుతో కొనలేనివి కొన్ని వున్నట్టే, సంపాదన అవకాశాలు పెంచలేని మాతృభాష వినడం, మాట్లాడడం, చదవడం, వ్రాయడం తెచ్చి ఇచ్చే ‘ఆనందం’ సంపాదన అవకాశాలు పెంచే ఇతర భాష ఇవ్వలేకపోవచ్చు.


ఏ భాషైనా బ్రతకాలంటే ఆ భాష మాట్లాడే వారికి ఆ భాషపట్ల గౌరవం, అభిమానం, ఆ భాషని నిలపాలన్న ఆకాంక్ష ముఖ్యం. అవి ఉన్న తరవాత, పిల్లలకు నేర్పడం అతి ముఖ్యం. ఆ భాష నేర్చుకొనేందుకు కావలసిన ప్రోత్సాహాన్ని, వాతావరణాన్ని, అవకాశాలని, పుస్తకాలు మొదలైన వాటిని నేర్చుకొనే వారికి ఏర్పాటు చెయ్యాలి. ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులది. సంఘపరంగా ఆలోచిస్తే తెలుగు భాష పచ్చదనం యొక్క నైతిక బాధ్యత తెలుగు భాష పేరిట ఏర్పడ్డ తెలుగు సంఘాలది.

(9) తానా, (10) ఆటా ల బాధ్యత ఏమిటి?

ఈ భాషా, గీషా కల్చర్, గిల్చర్ ఏమిటి? అదంతా హంబక్! మనం అంతా మన ఉద్యోగాలు, డబ్బు, మంచి ఫ్యూచర్ కోసం వచ్చాం. దట్సాల్! ఏదో సరదాగా నలుగురం కలవడానికి ఏర్పాటు చేసుకున్న ఈ అసోసియేషన్ మీద ఆ ఐడియల్ నాన్సెన్సంతా రుద్దకండి. అనే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? ఇవాళ కాకపోతే, రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు తెలుగుభాష చనిపోయేదేగా, అటువంటి దానిని నిలబెట్టడానికి ఎందుకీ ప్రయత్నాలు అంటారా? మన తల్లిదండ్రులు, మనం, మన పిల్లలు కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోయేవారేగా!‘తెలుగు’ పేరిట సంఘం పెట్టాం. తెలుగు భాషకి ఏ కొద్దిపాటి సేవైనా చేద్దాం అనుకునే వాళ్లకి చెయ్యడానికి, చేయించడానికి, చేసి అమెరికాలో తెలుగు భాష కొత్త రెమ్మలు వెయ్యడానికి కావలసిన అవకాశాలు కలిగించడానికి చాలా ఉంది.


సూచనలు:
1. అట్లాంటాలో జరిగిన ‘తెలుగు సాహితీ సదస్సు‘ (1998)లో ప్రతిపాదించబడినది. (శ్రీ గవరసాన సత్యనారాయణ) ‘తెలుగు పీఠం‘ ఏర్పాటు చేయడం. (11)
2. తెలుగు భాషని రెండోతరం వారు, మాతృభాష కాని వారు సులభంగా నేర్చుకోడానికి కావలసిన ఆడియో, వీడియో, పుస్తకాలు మొదలైనవాటిని అందరికి అందుబాటులోకి తేవడం.
3. అనువాదాలని ప్రోత్సహించడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందించడం. (శ్రీ అరి సీతారామయ్య)
4. తెలుగుమాట, తెలుగు వ్రాత కంప్యూటర్ గుర్తించడానికి కావలసిన ప్రణాళికని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న నిపుణుల ద్వారా తెలుగు కంప్యూటరీకరణను ప్రోత్సహించడం.
(శ్రీయుతులు వేమూరి వెంకటేశ్వరరావు, కొచ్చర్లకోట వెంకట బాపారావు, చోడవరపు ప్రసాదు....)
5. తెలుగులో ప్రపంచస్థాయి ఉన్న ప్రామాణిక గ్రంథాలను ముందు తరాలకు అందుబాటులో ఉండేలా దాచుకోవలసిన తెలుగు సాహితీ సంపదని కంప్యూటర్ కాంపాక్ట్ డిస్కులపై ప్రచురించడం (శ్రీ పిల్లలమర్రి రామకృష్ణ)

మనం మన చేతితో నాటిన ‘అమెరికాలో తెలుగు’ అనే ఈ మొక్కని, చక్కగా పోషించి, పెంచి పెద్దచేసే బాధ్యత మనందరిది. మనని సభ్యులుగా చేసుకుని ‘తెలుగు జెండ’ ఎగరవేస్తున్న మన తెలుగు సంఘాలది. ‘తెలుగుదనం’ తెలుగు భాష అవసరం లేకుండానే నిలపవచ్చు. దీనికి తెలుగు సంస్కృతి మూలస్తంభం అని అనుకుంటే, మరి అంత ముఖ్యమైన తెలుగు సంస్కృతిని తమ తమ సంఘాలద్వారా తెలుగువారు ఎలా నిలబెట్టుకుంటున్నారో రాబోయే వ్యాసంలో చూద్దాం.

ప్రవాస శ్రుతిలో తెలుగు సంస్కృతి
భారతదేశంలో వింధ్య పర్వతాలకు దక్షిణంగా, సుమారు 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, దాదాపు 30 నదులతో, కనీసం క్రీ.పూ. 8,000-6,000 సంవత్సరాల నుండి (పురావస్తు పరిశోధనల ఆధారంగా) మానవులు నివసించారు. నేటి మన ఆంధ్రప్రదేశ్ నేలపై అందుబాటులో ఉన్న చరిత్ర, సాహిత్యం, ఆధారంగా, దక్షిణాపథం పేరుతో గుర్తించబడి, (క్రీ.పూ. 1500), శాతవాహన రాజ్యస్థాపన (క్రీ.పూ. 300-200) వలన ఓ ఆకృతి పొందింది. కనీసం 100 తరాల నిర్దిష్టమైన చరిత్ర, సామాజిక పరిణాన వారసత్వం కలిగి, 1956 నవంబరు 1వ తారీఖున ఒక రాష్ట్రంగా ఏర్పడింది నేటి ఆంధ్రప్రదేశ్. (1) బహుజన, బహుముఖ, విస్తృత అభివృద్ధితో సుమారు 3,500 సంవత్సరాలుగా కళకళలాడిన సంస్కృతి నేడు అతి తక్కువ చరిత్ర, అంతకన్నా తక్కువ తనదైన సంస్కృతి గల ఉత్తరమెరికా ఖండంలో ప్రవాసంలో ఎలా ఉంది?


ఉత్తరమెరికాలో తెలుగు సంస్కృతి

కల్చర్ అంటే ఏమిటి? పెద్ద సమాసాలు ఉన్న వ్యాసాలు, ఉపన్యాసాల జోలికి పోకుండా ‘ఫెలో తెలుగుస్’ కి అర్థం అయ్యేలా చెప్పాలంటే, కల్చర్ అంటే మన జీవన విధానం! మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా పనులు చేసే తీరు, ఆలోచించే విధానం, ఆనందించే విలువలు, విషయాలు, రకరకాల సందర్భాలలో తోటివారితో పొరుగువారితో, అంతరంగికులతో, అతిథులతో, కుటుంబసభ్యులతో ప్రవర్తించే విధానం. మన సంగీత, సాహిత్య, వినోద సముదాయం, వీటన్నింటిలో అంతర్లీనమై ఉన్న మానసిక స్థితి కూడా మన సంస్కృతిలో బాగమే.


ఉదయం నిద్ర లేవడం, పరుగు పరుగున పనికి వెళ్ళడం, పని, పని, పని, సాయంత్రం ఇంటికి రావడం. వంట, తిండి, అలసిపోయాననుకోవడం. టీవీ, ఫోనులో సంభాషణలు లేదా కంప్యూటర్ పై స్టాకులు వగైరా. నిద్ర వీకెండ్ లో మరింత డబ్బుకై మరింత పని డబ్బు, హోదా కొద్ది ఆటలు, పార్టీలు. మనకంటే గొప్ప కల్చల్ లేదని స్వంత డబ్బానో, అమెరికాలో అంతా ఆదర్శనీయమే అనే లెక్చర్లో. ఇండియాలోని ‘డర్ట్‘, అమెరికాలోని ‘బెస్ట్‘ లిస్ట్ అప్పచెప్పడమో. ఎదుటివారి ఆర్థిక, సామాజిక స్థోమతల అంచనాలు. తెలుగు సంఘాల రాజకీయాల చర్చతో గడుస్తుంది వీకెండ్. అర్థరాత్రి నిద్ర రాని సమయంలో ఇది ‘రేట్ రేస్‘, అన్న సత్యం కనుక్కున్న తృప్తి. ఉదయం నిద్ర లేచినది మొదలు ‘అమెరికన్ డ్రీమ్‘ పై ఆసక్తి.


కొంతమందికి ‘కల్చర్‘పై మోజు. పిల్లలకు డాన్స్, సంగీతం నేర్పించడం, స్టేజ్ ఎక్కించడం. దానికై తెలుగు సంఘాలలో ఉత్సాహంగా పాల్గొనడం. పోటీలు పడడం. పదవులు పొందడం. వీలుకాకపోతే వెనుకనుండి నడిపించడం డబ్బులు దండడం. ప్రోగ్రాములు పెట్టడం. పెద్ద ఎత్తున సభలు జరపడం, అమెరికాలో తెలుగు సంస్కృతి నిలబెడుతున్న నాయకుల జాబితాలో చేరడం, ఫోటోలలోకి దిగడం. ఎంతైనా ఉంది వ్రాయడానికి. ఇంతేకాక సంస్కృతి అనగానే ఎక్కడిది‘ ఎవరిది‘ ఎప్పటిది‘ అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. విజ్ఞులైన పాఠకులు ఈ ప్రశ్నలని వేసుకుంటారని, ఆలోచిస్తారని, ఊహించుకోగలరని ఆశిస్తాను.


ఒకే పాటని, ఎవరి శ్రుతిలో వారు పాడుకొనేటట్లే ఉత్తరమెరికాలో ప్రవాసాంధ్రులు ‘తెలుగు సంస్కృతి‘ పాటని ప్రవాస శృతిలో పాడుకుంటున్నారు.

తెలుగు సంస్కృతిని ఎలా నిలుపుకుంటున్నారు?
సంక్రాంతి, ఉగాది, సమ్మర్ పిక్నిక్ (వనభోజనం), దీపావళి, తమ, తమ పట్టణాలలో జరుపుకుంటారు. సంగీత, సాహిత్య నృత్యాలలో ప్రతిభ ఉన్నవారిని, వీలైనప్పుడల్లా రప్పిస్తారు. మన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామన్న పేరుతో వీలైన చోట్లకల్లా పంపి తగు స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. డబ్బు వసూలు చేస్తుంటారు. వాటి లెక్కలు వివరాలు, వాటి వల్ల తెలుగు సంస్కృతికి జరిగే ప్రయోజనాల వివరాలు అంతగా అందరికీ తెలియవు.

ఖర్చు ఘనం, ఫలితం... జూలై మొదటి వారాంతంలో ప్రతి ఏడు పెద్ద ఎత్తున ఏదో ఒక పట్టణంలో తెలుగు సభ (తానా-ఆటా) కార్యక్రమాలని ప్రతి ఏటా ఏర్పరుస్తారు. ఈ ఆచారం 1977 తొలి తానా సభలతో మొదలయింది (శ్రీ గుత్తికొండ రవీంధ్రనాధ్). ఇటువంటి సభలు ఇప్పటికి 17 జరిగాయి. ప్రస్తుతం 18వ ది ఫిలడెల్ఫియాలో జరగబోతున్నది (శ్రీ అల్లాడ జనార్థన) సుమారు 900 మంది హాజరయిన తొలి తెలుగు సభలు నేడు 10 రెట్లు సంఖ్యలో, ఖర్చు అంకెలలో 200 రెట్లు (సుమారు 1.6 మిలియన్)కి చేరుతున్నది. ఈ సభలకి హాజరయ్యే వారు అందరు చేసే అన్ని ఖర్చుల మొత్తం అంచనా వేస్తే దాదాపు 8-10 మిలియన్లు చేరుతున్నది. అంటే సుమారు 37.6-47 కోట్ల రూపాయలన్న మాట. ఇంతేకాక అందరూ ఈ సభలకై వెచ్చించే కాలాన్ని లెక్కకడితే అది సుమారు ఒక లక్ష పని గంటలు కావచ్చు. ప్రతి ఏడాదీ తెలుగు సంస్కృతి పేరిట ఈ సభలు జరగడం అద్భుతమైన విషయం. తెలుగు జాతి ఆనందించవలసిన విషయం. అయితే దీని ఫలితం ఏమిటి? ఆలోచించండి!

కల్చరింగ్ ‘క్రౌడ్ పుల్లర్సు‘ : ఈ సభలో జరిగే కల్చరల్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించబడుతున్న వారు మన తెలుగు సంస్కృతికి ఎంతవరకు ప్రతీకలు? ఏంటి మీరంటుంది? సినిమా స్టార్లు మన కల్చర్ కాదనా?, ఆళ్ళని పిలమాకండనా? అట్టా కుదరదు. ఆళ్ళొస్తేనే మనోళ్ళొస్తారు. రాజకీయనాయకుల్ని, సినిమావోళ్ళని పిలవొద్దన్న మా ఫ్రెండొకడు సింసినాటీ తానాలో ఆళ్ళ చుట్టూ తిరిగాడు తెలుసా! అట్టమీద సినిమా స్టార్ల బొమ్మ లేకపోతే తెలుగు పత్రికలెలా నడవవో, మనకీ అలాగే సినిమావోళ్ళు లేకపోతే, మన తానాలు ఆటలు కూడా నడవవండీ. వాళ్ళు క్రౌడ్ పుల్లర్సండి! బాబు, క్రౌడ్ పుల్లర్సు! అలా సమర్థించుకుంటూ, అట్టమీద బొమ్మలకై, అవినీతికి పట్టుకొమ్మలైన రాజకీయనాయకులకై ఎగబడే వారి స్థాయికి ఉన్నత విద్యావంతులు, మేధావులు అనిపించుకోబడుతున్న, ప్రవాసాంధ్రులని దిగజార్చిన ఘనత తానా, ఆటాల కల్చరల్ కమిటీ ఛైర్పర్సన్లకు వారి కమిటీ సభ్యులకు తప్పకుండా దక్కుతుంది. అలా ఫుల్ చేసిన క్రౌడ్ ఏం చేస్తున్నది?


ఇంతేకాక, అమెరికాలో వివిధ జాతుల యొక్క సంస్కృతుల పరిచయ, ప్రభావాల వలన తెలుగు సంస్కృతిలో మునుపెన్నడూ లేనటువంటి రీతిలో రకరకాల ఆచరణలు, ఆలోచనలు జరుగుతుంటాయి. వీటిలో ఏవి ప్రయోగాలు? ఏవి పనికి వచ్చేవి? ఏవి భద్రపరుచు కోవలసినవి? ఇంతటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని మన సంస్కృతిలో లోపాలని సంస్కరించుకొని, తెలుగు సంస్కృతికి అంతర్జాతీయ గౌరవాన్ని కలిగించే బాధ్యత ఈ ప్రవాసాంధ్రులపై ఉందన్న విషయం గ్రహించడం, దానికి తగిన ఆచరణయోగ్యమైన పథకం రూపొందించడం ముఖ్యం. మరి జరుగుతున్నాయా?

తెలుగు హెరిటేజ్ (వారసత్వం)

ఒక పదం వినగానే, ఒక భంగిమ చూడగానే, ఒక రాగం తలవగానే కలిగే పులకింత మన సాంస్కృతిక వారసత్వం. అది డబ్బుతో కొనలేనిది. మిషన్లు అందించలేనిది. అటువంటి దానిని, కొత్త సంస్కృతుల సంపర్కంలో మెరుగుపెట్టి మరో తరం వారికి అందించవలసిన బాధ్యత తల్లి తండ్రులది. తరువాతి తరాలకు ఎలా అందిస్తాం. ? ప్రతి శతాబ్దంలో సంస్కృతి రకరకాల ప్రభావాలకులోనై సంస్కరించబడుతు సాహిత్య, జీవన విధానాలలో ప్రతిబింబించబడుతు తరువాత తరాలకు అందజేయబడుతుంది. అమెరికాలో పెరుగుతున్న రెండో తరం పిల్లలకి తెలుగు సంస్కృతి నేర్పడం కష్టం అంటారు. ఎందుకు, ఎందుకంటే, ఇక్కడ పిల్లలపై ప్రతిరోజు ఎన్నో రకాల సంస్కృతుల ప్రభావంపడుతూ ఉంటుంది. వీటిలో తెలుగు సంస్కృతి అందించవలసినది ముఖ్యంగా తల్లీ, తండ్రే! వారికి సంస్కృతి పట్ల సరియైన అవగాహన ఉండాలి. ఉన్నదానిని సరియైన పాళ్ళలో పరాయి సంస్కృతుల ప్రభావాలతో పాటు అందించే నేర్పు, ఓర్పు ఉండాలి. వీటితోపాటు తగిన వాతావరణం అవసరం. అటువంటి వాతావరణం అందించడం తెలుగు సంఘాల ముఖ్యోద్దేశంగా చెప్పుకొంటాయి. కానీ, గత 30 సంవత్సరాల తెలుగు సంఘాల కృషి తరవాత కూడా, 18వ తెలుగు సభలకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి మనం ఆంధ్రప్రదేశ్ నుండే ఎక్కువమంది కళాకారులని, తదితరులని రప్పించుకుంటున్నామంటే ఇక్కడ జరిగిన మన సాంస్కృతికాభివృద్ధి సంగతేమిటి?

ఈ ప్రశ్నలకి జవాబు చెప్పవలసిన అవసరం, కాలం, వీలు యీ సంఘాల మాజీ, ప్రస్తుత ప్రెసిడెంట్లకు, ఆ పదవి ఆశించే ప్రవాసాంధ్ర తెలుగు సాంస్కృతిక రంగాలలోని నాయకులకు లేకపోవచ్చు. వారికింకా పెద్ద పెద్ద పనులుంటాయి. ముఖ్యమైన బాధ్యతలుంటాయి. ఇటు అమెరికాలో అటు ఇండియాలో చక్కబెట్టవలసిన పనులెన్నో ఉంటాయి. కాబట్టి వారికి తీరిక ఉండదు. కానీ కల్చరల్ కమిటీ ఛైర్ పర్సన్ హోదాలో కుర్చీ ఎక్కిన వారి మాటేమిటి? వారి బాధ్యత ఏమిటి?


అటువంటి వారిపై (కల్చరల్ కమిటీ ఛైర్ పర్సన్) అంత బాధ్యత పెట్టి మనం మన ఇళ్ళల్లో కాలుమీద కాలేసుకుని, కేజువల్గా టీవీ చూసుకుంటుంటే ఈ శృతిలో కాక మరే శృతిలో ఉంటుంది తెలుగు సంస్కృతి?


మానవజాతి విశిష్ట వికాసానికి మూలకారణమైన సంస్కృతి (జాతి జీవన విధానం, సంగీత, సాహిత్య, కళలు) గతి తప్పుతున్నప్పుడు, ప్రభువులు విజ్ఞానవంతుల, విద్వాంసుల, విద్వత్సంపన్నులతో విచారించి తగు చర్యలు తీసుకొని సాస్కృతిక పరిరక్షణ చేస్తూ వచ్చారు. నేడు ప్రజలే ప్రభువులు. అందుచేత ఆ బాధ్యత మనందరిది. ఇది సరియైనది కాదు. ఇది తప్పు అని ఎత్తి చూపించడమే కాకుండా కనీసం కొన్ని సరియైన వాటిని గుర్తించి చూపించడం బాధ్యతగా ప్రవర్తించే వారి లక్షణం. అందుచేత అటువంటి కొన్ని కార్యక్రమాలని వాటిని జరిపించే శక్తి, ఆసక్తి కలవారిని సూచించడం జరిగింది.


సూచనలు:
1. తెలుగు భాష, బట్ట, ఆలోచన, ఆహారం, లాస్యం, హాస్యం, విలాసం, వినోదం – తెలుగు జీవన విధానం (కల్చర్)ని ప్రతిబింబిస్తూ ఒక చక్కైనన ఏర్పాటు చేసి ఉత్తర అమెరికా అంతా చూపించడం. (శ్రీ ఎస్.వి.రామారావు)
2. కూచిపూడి నృత్యానికి అమెరికా విద్యాలయాలలో గుర్తింపు కలగడానికి కావలసిన ఏర్పాటు చేయడం (శ్రీమతి పెనుమర్తి శశికళ)
3. మన వాగ్గేయకారుల సంగీత, సాహిత్య సంపదని తెలుగు మాట ఇంటింటా నిలపడాన్ని ప్రోత్సహించడం. (శ్రీ దేవరకొండ శ్రీనివాసరావు)
4. తెలుగువారి చరిత్ర, సంస్కృతి, తెలుగుతనం వివరించే సమగ్రమైన వెబ్ పేజ్ ఏర్పాటు చేయడం (శ్రీ పగిరి మదన మోహన్)
5. తెలుగు సంఘాల సమన్వయ సహకారాలతో రెండో తరంవారిని, తెలుగుతనం, భారతీయత ద్వారా ప్రపంచ కుటుంబంలో మంచి సంస్కృతి కలవారిగా నిలబడడానికి కావలసిన అవకాశాలు వాతావరణం కల్పించడం (శ్రీ కోటపాటి సాంబశివరావు)

ఇవన్నీ ఎందుకండీ? ఏ జాతి ప్రజలు బహుముఖంగా బలవంతులై ఉంటారో వారి సంస్కృతి వర్థిల్లుతుంది అంటారా? అది నిజమే. మరి తెలుగుజాతి బహుముఖాభివృద్ధికి తానా, ఆటాలు, మిగిలిన సంఘాలు ఏం చేస్తున్నాయో తరువాతి వ్యాసంలో చూద్దాం.

జన్మభూమికి ప్రవాసుల ‘శతకోటి’ నోటి మాట

కనీసం 25,000 కోట్ల రూపాయల (5.32 బిలియన్ డాలర్లు) ఖర్చుతో (1), నిక్కచ్చిగా పనిచేసే ముఖ్యమంత్రితో, ప్రజల ‘బాగు’కై రాత్రీ పగలు శ్రమించే అన్ని పార్టీల నాయకులతో, ప్రజాసేవకై ఎంపిక కాబడ్డ వేలాది అధికారులతో విరాజిల్లుతున్న మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది?

ఆర్థిక, ఆరోగ్య మరియు సామాజిక స్థితిగతులను పరిగణనలోనికి తీసుకుని నిపుణులందరి ఆమోదంతో మానవ అభివృద్ధి సూచికని తయారు చేసారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగంవారు (2). ప్రస్తుతం, సూచిక అందుబాటులో ఉన్న భారతదేశం (0.423)లోని 16 రాష్ట్రాలలో 1వ స్థానంలో కేరళ (0.603), 10వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. (0.400) (3) అంచనాల ప్రకారం కొన్ని జిల్లాలు అతి వెనకబడ్డ ఆఫ్రికా దేశాలకంటే వెనకబడ్డవిగా ఉన్నాయి.

‘ఛా! అని పార్టీలో బీర్ తాగుతూనో, బెంజ్ కారు ఎక్కి పార్టీకి వెడుతూనో, నన్ను కొట్టిపారెయ్యవచ్చు. కానీ,

51000 కోట్ల రూపాయల (బిలియన్ డాలర్లు) అప్పు (4) కై రాష్ట్రం బడ్జెట్లో 29.5 శాతం ప్రతీ ఏటా వడ్డీలకే కట్టాలి(5). రాష్ట్రంలో 26,568 గ్రామాలు ఉన్నయా. (6) వాటిల్లో పెరుగుతున్న ధరలతో పాటు పెరగని కూలి, అది పెంచుతున్న అతి గడ్డు బీదరికాన్ని మోస్తున్న కోటిమంది జనం ఉన్నారు. అలాంటి జీవితాన్ని మొయ్యలేని వాళ్ళు, 1997-98లో వరంగల్లు, నిజామాబాద్ లో ఆత్మహత్యలు చేసుకున్న 400 మందిలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. (7)

అయితే ప్రగతి లేదా? ఎంగుకు లేదు. ఉంది. చాలా ఉంది. కానీ ఆర్థికాభివృద్ధి అతికొద్దిమందికి మాత్రమే పరిమితమైపోతున్నారు. మన శరీరంలో ఏదో ఒక భాగమే మిగిలిన వాటికంటే ఎక్కువగా పెరిగితే దానిని ‘వాపు’ అని అంటాం. జబ్బుగా గుర్తిస్తాం. వైద్యం ద్వారా నయం చేసుకుంటాం. కానీ పెరుగుదల అని అనం. అలాగే ఆర్ధిక అసమానతలని గుర్తించి, నయం చేసుకుని, రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

‘ఆంధ్రప్రదేశ్ 2005 నాటికల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందిట తెలుసా?’. ఉద్దేశం మంచిదే. రాష్ట్రంలో ఉన్న 1.75 కోట్ల మంది 5-14 వయస్సున్న బాల బాలికలలో ప్రభుత్వ లెఖ్కల ప్రకారమే 45 లక్షలమంది ఎటువంటి బడికి వెళ్ళడం లేదు (9). వీరిని బడికి పంపి కనీసం ఐదేళ్లు బడిలో చదువుకునేలా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా కనీసం 950 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి. అందుకే మళ్ళీ ప్రంపచబేంక్ వద్ద ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కనీసం ఐదు ఏళ్ళపాటు అప్పు కావాలి (10) అంటే మరో 5,000 కోట్లు రూపాయలు (1.06 బిలియన్ డాలర్లు) అప్పు అన్న మాట.

అయితే ఈ రాష్ట్రం ఇక బాగుపడదా? ఇంక ఆశ లేదా? ఉంటే బాగుపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తమ లోటుపాట్లని తెలుసుకుంటున్నది. ఒప్పుకుంటున్నది (11). 1956 నుండి గల ప్రభుత్వ బడ్జెట్ వివరాలు అందరికి తెలిసేలా ఇంటర్నెట్ పై ఉంచింది. (12) ప్రవాసాంధ్రులని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములుగా చేరమని పదే పదే కోరిన ముఖ్యమంత్రి చక్కనైన అవకాశాన్ని కల్పించగలరని అనిపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రులు ఎందుకు ఆలోచించాలి?
ఏనేల నుండి అస్తిత్వం పొంది జీవి అయ్యామో, ఏ నేల గాలి పీల్చి పెరిగామో, ఏ నేలపై ఆటలు ఆడి ఎదిగామో, ఏ నేల నేర్పిన పాఠాలే నేటి అర్హతల పునాదులుగా ప్రవాసంలో అతి ప్రతిభావంతమైన జాతి ప్రతినిధులుగా, ప్రజ్ఞావంతులుగా, అభివృద్ధి సోపానాలను ఆదరాబాదరాగా ఎక్కడానికి అవకాశం కల్పించిందో, ఆ నేలవైపు ఒక్కసారి చూడండి. తొలకరిలో వర్షపు నీటి బొట్టుపై ఎదురు చూసే బీటలు వారిన పంట నేలలా వేలాది గ్రామాలు నిస్వార్థ సేవచేసే వారికై ఎదురు చూస్తున్నాయి.

అత్యంత ఆధునిక, సాంకేతిక, ప్రపంచంలో బ్రతుకుతూ దానిని మరింత అభివృద్ధి చేయడానికై ఎన్నో ఉపాయాలు ఆలోచించగల శక్తి ఉన్న మీరు కొద్దికాలాన్ని, కొన్ని ఆలోచనలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై వెచ్చించడంలో చాలా తృప్తి పొందగలరు.

వాదాలకి, వివాదాలకి దూరంగా, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణంలో స్వశక్తి మీద బ్రతుకుతూ, అక్రమమైన అర్జన, అర్హతలేని పదవి వంటి వ్యామోహాలకు లోను కావలసిన అవసరం లేని ప్రవాసాంధ్రులుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీవంతు పని మీరు చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏవిధంగా సహాయం చేయగలరు?
ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులు అందరు కలసి ముందుకు వచ్చి, వారివ్వగలిగినంత ఇచ్చినా అది కావలసిన దానిలో 1 శాతం కూడా కాకపోవచ్చు. అంత డబ్బు ఇవ్వలేకపోయినా ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదో ఒక ఉపాయం ఉండాలి కదా! శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయంటారు. అన్ని ఉపాయాలు కాకపోయినా, కొన్నైనా ఇవ్వగలరు కదా. కొంతైనా పని చెయ్యగలరు కదా! సమయానికి చేస్తే, అది అవసరంలో ఉన్నవారికి ‘శతకోటి’కి సమానం.

ఆంధ్రప్రదేశ్ లోని సమస్యలు అన్నింటిని పరిష్కరించడానికి చాలినంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. మనం ఇయ్యలేం. మరేంచెయ్యాలి? ప్రభుత్వం చాలా డబ్బు జీతానికి, అధికార యంత్రాంగం నడపడానికి ఖర్చుచేస్తుంది. దానిని ఉన్నట్టుండి తగ్గించలేరు. కానీ ఖర్చు అయ్యే ప్రతి రూపాయకి, ఇప్పటికంటే ఎక్కువ ప్రతిఫలం వచ్చేటట్టు చేయవచ్చు. అలాగే అప్పు వినియోగించే పద్ధతులను అధిక ఫలితాలను ఇచ్చేటట్టు, దుబారాని తగ్గించేటట్టు చేసే అవకాశం ఉంది. ఈ పని చేయడం సులభం కాదు. ఎందుకంటే ఇది ప్రజలలో జీర్ణించి ఉన్నపని తీరుకు సంబంధించిన విషయం. కానీ ప్రయత్నించాలి. దాని ద్వారా, మనం దారిద్ర్యాన్ని, నిరక్షరాస్యతను, వాటివల్ల కలిగే వెనుకబడినతనాన్ని తగ్గించవచ్చు (శ్రీ వేమూరి వేంకట రామనాధం).

ఆర్థిక అసమానత, బీదరికం ఒక్క ఆంధ్రప్రదేశ్ సొత్తే కాదు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ పరిస్థితిలోనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద కొన్నివేల మంది మానవాభివృద్ధికై కృషి చేస్తున్నారు. వారి వారి ప్రణాళికలను, ఫలితాలను ప్రతీ ఏట పరిశీలించి, అత్యున్నతమైన ప్రణాళికలను గుర్తిస్తారు. 2000 సంవత్సరం నాటి వచ్చిన ఎన్నో ప్రణాళికలలో మన రాష్ట్రానికి ఉపయోగపడేవి, మీ మీ వృత్తిపరమైన అనుభవానికి దగ్గరగా ఉండేవి, మీకు ఆసక్తి ఉండేవి ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దానిని తీసుకుని, పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ లో ఆచరణలో పెట్టండి.

అక్షరాస్యత అంటే పిల్లలు బడికి వెళ్ళడమే కాదు. నిజంగా అక్షరాస్యులు కావాలి కూడా. ముంబాయిలో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రథమ్ అనే సంస్థ (14) ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తున్నది. వారి అనుభవం ప్రకారం ప్రభుత్వం ప్రాథమిక విద్యకై పెట్టే ఖర్చులో 1 శాతం ఖర్చుతో మాత్రమే మంచి ఫలితాలు సాధించారు. ఇందుకు గాను ప్రథమ్, వారు ఎంపిక చేసి అత్యుత్తమమైన మూడు ప్రణాళికలలో ఒకదానిగా గుర్తించబడినది. మరి అటువంటి ఆలోచనలను మరికొన్నింటిని వివిధ రంగాలలో ప్రవేశపెట్టాలి. ఈ పని ప్రవాసాంధ్రులు చెయ్యవచ్చు కదా!

అదేమంత సులభం కాదు. ఏ పని చెయ్యాలన్నా ఏ ప్రజల అభివృద్ధికై పనిచేస్తామో, ఆ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆఖరికి ప్రభుత్వ యంత్రాంగం వెయ్య అడ్డంకులు కలిగిస్తారు. నిజమే, అనుభవంతోనే ఒప్పుకుంటాను. కానీ, మీ మేధస్సుతో, కృషితో, పట్టుదలతో విదేశంలో ఎన్నో రకాల అడ్డంకులనీ, వివక్షతలనీ ఎదుర్కొని, వృత్తి, వ్యాపార, సమాజ, రాజకీయ రంగాలలో కూడా నిలదొక్కుకొని, పదవులు, గౌరవాలు, పొందుతున్న మీకు, మీ నేలపై, మీరు చెయ్యబోయే నిస్వార్థమైన పనులకు వచ్చే అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొని, పనిచేసే శక్తి ఎందుకు లేదు? ఈ విషయంలో మనలో కొద్దిమంది చాలా అనుభవంతో, ఫలితాలు పొందిన వారున్నారు. వారిని సంప్రదించండి (శ్రీ వెగేష్న పృథ్వి రాజు).

మనందరికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వందకోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఆశ ఉండవచ్చు. ఇవ్వలేకపోవచ్చు రాష్ట్రప్రభుత్వం ఏ ఒక్క రంగంలో చూసినా వందలకోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నది (1). అనాలోచితమైన ఆచరణ, అలసత్వం, అధికార దుర్వినియోగం, లంచగొండితనం, ప్రజల నిరక్షరాస్యత, అందరి ఉమ్మడి స్వార్థం వలన ఫలితాలు సక్రమంగా లేవు. ఒక ఏడాది మీకు తోచిన రంగంలో, మీకు నచ్చినచోట ఆంధ్రప్రదేశ్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనండి. వివరాలు అర్థం చేసుకోండి. పరిస్థితులను గమనించండి. సమస్యలని పరిశీలించండి. ఆచరణయోగ్యమైన పరిష్కారాలను అందించండి. సాధించగల గమ్యాలను ఏర్పాటు చేసుకోండి. మీ ప్రయత్నాల వలన మంచి ఫలితాలు నూటికి ఒక్క శాతం ఎక్కువైనా అది, కోటి రూపాయలు మీరు ఇచ్చినా సాధించలేని అభివృద్ధికి మీకు తోచిన విధంలో ఖర్చుపెట్టండి (శ్రీ దామా వెంకయ్య). అతి ముఖ్యమైన రంగాలలో నిశ్చయమైన అభివృద్ధికి ప్రవాసంలో ఉన్న మనం సంఘటితంగా పాల్గొనడానికి కావలసిన ప్రణాళిక తయారుచేసుకోవాలి.

సూచికలు :
1. ప్రాథమిక విద్య: పలురకాల సంస్థలు, వ్యక్తులు చాలా ఏళ్ళగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ విద్యా సంస్థలని స్థాపించడంగానీ, సహాయం అందించడం కానీ జరుగుతున్నది. ఈ ప్రయత్నాలు అన్నింటిని సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొనేటటువంటి ప్రణాళిక కావాలి. (శ్రీ పూరకరణం శ్రీకాంత్).
2. ఆరోగ్యం : ప్రవాసంలో ఉన్న తెలుగు వారిలో వైద్యులు ముఖ్యులు. కొందరు వారి వారి గ్రామాలలో వైద్య సౌకర్యాలు కలిగిస్తున్నారు. (ఉదాహరణకు : డా. కోమల, సాంబశివరావు మల్లంపాటి – వేములపల్లి, కృష్ణా జిల్లా). కానీ, కనీస వైద్య సౌకర్యాలు కూడా అందని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డయేరియా, మలేరియా, ఫైలేరియా వంటి నివారించగల జబ్బులతోనే అత్యధిక జనాభా నేటికీ బాధపడుతున్నారు. వీటిని ఎదుర్కోవడం ఎలా? దానికి తగిన పథకం ఏమిటి? ఈ విషయాలలో అనుభవజ్ఞులని సమీకరించి, వారందరూ కలసి పనిచేసేందుకు వీలైన ఒక పథకం రూపొందించాలి (డాక్టర్ వి.కె.రాజు).
3. ప్రజాస్వామ్య పరిరక్షణ – ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పబడే మన దేశంలో పౌరహక్కులు రక్షించుకోవడం ప్రజల అతి పెద్ద కర్తవ్యం. లోక్ సత్తా (15), మరియు వివిధ సంస్థలు ఎంతో కొంత, ఏదో ఒక తీరులో పని చేస్తున్నాయి. విటినన్నింటిని ఒక సామూహిక శక్తిగా తయారుచేసి, ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించే అవకాశం పదవులకు ఆశించని ప్రవాసాంధ్రులకు ఉంది. (డాక్టర్ జంపాల చౌదరి).
4. గ్రామాభివృద్ధి – మన రాష్ట్ర ప్రగతి గ్రామాల ప్రగతికై పూర్తిగా ఆధారపడి ఉంది. అందుచేత గ్రామాభివృద్ధి అతి ముఖ్యం. సుమారు 40 శాతం గ్రామాలు, అంటే 10,000 గ్రామాలు అతి వెనకబడి ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రయత్నించడం 10,000 తానా సభ్యుల (16) కుటుంబాలకు పెద్ద కష్టం కాదు. సరియైన అవగాహన, అనుభవం ఉన్నవాళ్ళ సహాయం కావాలి (డా. గుత్తికొండ రవీంద్రనాథ్)

ప్రవాస తెలుగు సంఘాలని, వారి సభ్యులని ఉద్దేశించి, వారి వారి పని తీరుని విశ్లేషించకోమని సూచించి, ప్రవాసంలో సాంస్కృతిక అవసరాలకే మాత్రమే పరిమితమవక.. అర్హతలిచ్చిన నేలను ‘ఋణాంధ్రా’ గా కాక ‘స్వర్ణాంధ్రా’ కావడానికి తమ తమ పరిధిలో పాల్గొనమని ప్రేరేపించడమే ఈ వ్యాసాల ఆశయం. తానా, ఆటా మిగిలిన సంఘాల ద్వారా సేవ చేసి అనుభవం సంపాదించుకున్న మాజీ నాయకులను, సేవ చేయాలనుకుని పోటీ చేసిన వారిని, గెలిచిన వారిని సంస్కృతి గురించి సరియైన అవగాహన ఏర్పర్చుకోమని, మాటగా కాక, ప్రయోగాలుగా మాత్రమే కాక, నిజమైన ఆసక్తితో రాష్ట్రాభివృద్ధికి ముఖ్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేయమని అభ్యర్థిస్తున్నాను. పేరుకోసం, స్టాకుల్లో విసిగా విరామం కోసం, ఉబుసుపోక నాయకులు అవుదాం అని అనుకుంటే సరే. కానీ,

మీరు నిజంగా తెలుగు సంస్కృతి, తెలుగువారి అభివృద్ధి కోరే తానా, ఆటా, ఇతర తెలుగు సంఘాల నాయకులు కావాలనుకుంటే, పోటీలుపడి సేవ చేద్దామనుకుంటే, చెయ్యవలసిన పని ఎంతో ఉంది. దానికి పోటీలు లేవు. ఎందరైనా చెయ్యగలగినంత పని ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాల్గొనండి. ఈ సంఘాల ప్రసిడెంట్లుగా పనిచేసి పొందే తృప్తి కంటే, ఎన్నో రెట్లు ఎక్కువ తృప్తి పొందగలరు. నిజమైన నాయకులవగలరు.





0 వ్యాఖ్యలు: