తీరాల మధ్య....
న్యూయార్క్:
“సూర్యంగారు మన కుమార్ గారి విషయం మీకు తెలుసు కదా!”
“అవునండి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించాను. ఇంత అకస్మాత్తుగా ఆయన పోతారనుకోలేదు”.
“మీకు ఆయిన ఎంత పరిచయమో నాకు తెలీదు. కాని ఆయిన చాలా మంచివాడండి. అందరిని కూడకట్టి మన తెలుగు వాళ్ళకి ప్రతీ ఏడాది క్రిస్మస్ డిన్నర్లు ఇస్తూండేవారు”.
“తెలుసండి రామయ్యగారు, నేను కూడా కొన్నిసార్లు వాళ్ళింట విందు చేసినవాడినే”
“మీరూ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు కదా అని ఫోను చేసాను”.
“ఏమిటో చెప్పండి”
“ఆయిన చితాభస్మం ఇండియా పంపించాలండి. పోష్టులోనా, కొరియర్ లోనా ఎలా పంపాలో మీకు ఏమైనా తెలుసా?”.
“చితాభస్మం....... అవును. ఫ్యునరల్ హోమ్ వాళ్ళు సీల్ చేసి ఇస్తారు. పోష్టాఫీసులో డెత్ సర్టిఫికెట్ చూపి రిజిష్టర్ పోష్టులో పంపవచ్చు. ఏ పోష్టాఫీసులోనైనా వెళ్ళి అడిగితే వివరాలు ఇస్తారు. నేనొకసారి చాలా ఏళ్ళ క్రిందట పంపాను. అందింది కూడా”.
“కుమార్ గారి బంధువులు హైదరాబాదులో ఉన్నారు. వాళ్ళకి పంపితే చాలుట. ఎన్ని రోజులు పడుతుందో చేరడానికి?”
“నేను విశాఖపట్నం పంపినప్పుడు 20 రోజులు పట్టింది. మరి ఇపుడు ఇంకా తక్కువ సమయం పట్టవచ్చు. హైదరాబాద్ అయితే వారం లేదా పదిరోజులు పట్టవచ్చు. ఇంకా వేగంగా చేరాలంటే ఫేడర్స్, లేదా యుడియస్ కొరియర్ వాళ్ళని అడగమనండి.”
“అవును అలాగే చెబుతాను.”
“మంచిదండీ.”
మరో అరగంటలో-
“సూర్యంగారూ! వాళ్ళకి అంత తొందరేమీ లేదుటండి”
“అయితే పోష్టాఫీసు ద్వారా పంపమనండి”
“అది సరేకానీ మీరు ఏమైనా ఇండియా వెళుతున్నారా రెండు మూడు వారాల్లో?”
“అవునండి. వచ్చేవారం వెళ్తానేమొ. ఇంకా పూర్తి నిశ్చయం కాలేదు.”
“మరింకేం. మీకు ఆ చితాభస్మం ఇస్తే మీరు వెళ్ళినపుడు తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఇవ్వగలరా?”
“సరే అలాగే”.
“చాలా థేక్సండీ! ఉదయాన్నే వాళ్ళింటికి వెళ్ళాను ఈ విషయం మాట్లాడాలని. చితాభస్మం తీసుకొని మరో గంటలో వస్తాను. మీరు ఇంట్లో ఉంటారా?”
“అలాగే”
మరోగంట తరవాత
“సూర్యంగారూ మీరు చాలా సులభంగా ఈ సమస్యని సాల్వ్ చేసారండి ఈ చితాభస్మం ఈ డబ్బాలో చక్కగా సీల్ చేసి ఇచ్చారు ఫ్యునరల్ హోమ్ వాళ్ళు. దీన్ని మీరు ఇలాగే తీసుకెళ్ళవచ్చు.”
“సరే. చితాభస్మం నాతో తీసుకెళ్ళడానికి కావలసిన ఏ కాగితాలు కావాలో చెబుతాను. ఆ కాగితాలపై వాళ్ళ అబ్బాయితో కాని ఆయన భార్యతో కాని సంతకం పెట్టించి ఆయిన డెత్ సర్టిఫికెట్ కాపీ ఒకటి కూడా ఇమ్మనండి”
“సూర్యంగారూ ఐతే మీకు కావలసిన పర్మిషన్ లెటర్ మీరే డ్రాప్ట్ చేసి మెయిల్ చెయ్యండి. వాళ్ళతో దానిపై సంతకం పెట్టించి మీకు పంపమని చెప్తాను. ఇక వెళ్తాను. చితాభస్మం మీరు తీసుకెళ్ళడం పెద్ద సహాయమండి”.
మరో గంట తర్వాత -
“సూర్యంగారూ! మీరు హైదరాబాదు వెళ్ళడం నిశ్చయం అయిందన్న మెసేజ్ చూసాను. మీరు చేరేటప్పటికి వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు వచ్చి తీసుకొంటారు. మీ ఇండియా ఫోను నెంబరు, ఫ్లైట్ నెంబరు వివరాలు అన్నీ వాళ్ళ చుట్టాలకి ఇచ్చి, వాళ్ళ చుట్టాల కాంటాక్టు ఇనఫర్మేషన్ మీకు ఇవ్వమంటాను.
మరో పావు గంట తర్వాత -
“వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు రాలేరట. హైదరాబాదులో మీరు ఎక్కడుంటారో చెపితే మర్నాడు వచ్చి తీసుకొంటారుట.”
“దాందేముంది మాడ్రయివర్ కి ఇచ్చి వాళ్లింటికే పంపుతానులెండి.”
“అది కాదండి వాళ్ళు ఈ చితాభస్మాన్ని బయట లాకర్లోనో, స్టోరేజ్ లోనో పెట్టాలనుకొంటున్నారుట.”
మీరు హైదరాబాదు చేరినతరువాత మీ దగ్గరే ఉంచుకొంటే స్టోరేజ్ విషయం నిశ్చయం అవగానే మిమ్మల్ని కలిసి తీసుకొంటామంటున్నారు. వాళ్ళకి చితాభస్మం ఇంట్లో ఉంచుకోవడం ఇష్టంలేదుట. మంచిది కాదని వారి నమ్మకమట”.
“నేను మా తమ్ముడింట్లో ఉంటానండి. మరి వాళ్లేమంటారో?”
“మరి ప్రోబ్లమేనే?”
“ప్రోబ్లెం ఏముందండి? ఇంట్లో ఉంచుకోవాలని లేకపోతే అదేరోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే సరిపోతుంది కదా?”
రామయ్య గారు రెండు క్షణాలు ఆలోచించాడు.
మరో పదినిముషాలలో -
“అలా కుదరదండి. వాళ్ళకి రిజర్వేషన్లు అంత తొందరగా దొరకవటండి. రిజర్వేషన్లు దొరికినా శలవు దొరకదటండి. కాబట్టి మిమ్మల్నే ఓ స్టోరేజ్ లోనో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరో ఉంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వీలున్నపుడు నిమజ్జనానికి వెళ్ళే ముందు దాన్ని తీసుకొని వెళతారుట.”
“అలాగా”
“అవును నిజమే. కాని నేను మా తమ్ముడింటిలో ఎలా ఉంచగలను. వాళ్ళు ఉంచుకోమంటే ఏంచేసేది. సరికదా అమెరికా నుండి వచ్చి స్టోరేజ్ లో ఓ సీలు చేసిన డబ్బా నేను పెట్టడం, ఇంకెవరో వచ్చి తీసుకోవడం చాలా రిస్క్. హైసెక్యూరిటీ ఉన్నచోట, టెర్రరిష్టుల సమస్య ఉన్న ఈ రోజులలో.”
“అవును. అదీ నిజమే”
“మరి మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి”
“పోనీ ఇవన్ని ఏర్పాటు చేసానే అనుకోండి వాళ్ళ చుట్టాలు పిత్రుకర్మలు నిర్వహించి నిమజ్జనం చేస్తారని మీకు గట్టి నమ్మకం ఉందా?”
“ఇన్ని సార్లు వెనక్కి ముందుకు వెళుతున్న సంభాషణ ద్వారా వాళ్ళకి చితా భస్మం నిమజ్జనం చెయ్యడం మీద అంత ఇంట్రస్టు ఉందనుకోను.”
“ఇంతెందుకు కుమార్ గారి కొడుకుల్లో ఎవరో ఒకరు వెళ్ళి నిమజ్జనం చెయ్యవచ్చుగా.”
“వెల్.. ఆ పాజిబిలిటీ లేదండి. అందుకే మిమ్మల్ని సలహా అడుగుతున్నాం.”
“నన్నా?”
“మీకు వీలయితేనే. మీకు ఇలాంటి పట్టింపులు లేవని మా అందరికి తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతేనే.”
“నాకు పట్టింపులు లేవు కాని, అంత ఆస్థి ఉండి, ఉద్యోగాలు చేసుకొంటూ, బాగా సంపాదిస్తున్న పిల్లలుండి.......”
“వెల్ మరి వాళ్ళకి ఆ సెంటిమెంట్ లేనట్లే కనిపిస్తున్నది.”
“ఇండియాలో చితా భస్మం నిమజ్జనం చెయ్యాలన్నది ఎవరి ఉద్దేశ్యం?”
“ఉద్దేశం కాదు. కుమార్ గారి కోరిక.” తాను దేశం కాని దేశంలో తనువు చాలిస్తే భారతదేశంలో అదీ గోదావరిలో తన అస్థికలు కలవాలని కోరేవాడు.
నిశ్శబ్దం.
“రామయ్యగారూ! కుమార్ గారి చితాభస్మం నేనే నిమజ్జనం చేస్తాను ఫరవాలేదు.”
“మీరు చేసినట్లయితే ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసినవాళ్ళవుతారు. కుమార్ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఎంత ఖర్చు అయితే అంతా ఇస్తామంటున్నారు వాళ్ళు నాకూ ఒక బ్లాంక్ చెక్ కూడా సంతకం పెట్టి ఇచ్చారు మీకు ఇమ్మని.”
“నాకు ఖర్చు ఇవ్వఖ్ఖర్లేదు. కుమార్ గారు నాకూ స్నేహితులే!”
“అలా కాదు. మీరు ఖర్చు తీసుకోవాలి. చితాభస్మం నిమజ్జనం చేసిన ఫలితం పుణ్యం ఏమైనా ఉంటే అది వాళ్ళ కుటుంబానికి, కొడుకులకి దక్కాలి కదా. అందుకని.”
“హమ్మయ్య నెలరోజుల నుండి గుండెల మీద ఉన్న భారం తీరింది. కుమార్ గారి చితాభస్మం సవ్యంగా మీ చేతులమీద గోదావరిలో నిమజ్జనం అయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది.” నిట్టూర్చాడు రామయ్యగారు.
***
నర్సీపట్నం
తన మరణం తరువాత చితాభస్మం అస్థికలను తనవాళ్ళు కాశీలోనో, గోదావరిలోనో కలపుతారని అప్పుడే తనకు శాంతి చేకూరుతుందని వెంకటశాస్త్రిగారు అనుకునేవారు. కాని ఆర్థిక పరిస్థితి రానురాను క్షీణిస్తుంటే ఆ కోరికను భార్య వెంగమాంబతో బాహాటంగా అనలేక పోయేవాడు. కాని అంత్యక్రియలప్పుడు పురోహితుడు అస్థికలను గోదావరిలో కలపాలని చెప్పినప్పటి నుండి శాస్త్రిగారి కోర్కె వెంగమాంబగారిని చుట్టుముట్టింది.
వెంగమాంబ ఎనభైఏళ్ళ వృద్దురాలు. ఆమె భర్త చనిపోయి పదిహేను రోజులైంది. వారికి పెద్దగా ఆస్థిలేదు. గుమస్తాగా పనిచేసిన భర్త గాంధేయవాది.. జీవితం అంతా గాంధీ మార్గంలోనే నడిచిన వాడు. సత్యాగ్రహ కాలంలో జైళ్ళలో ఉన్నాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని చదువు పాడుచేసుకొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సొంత ఊరు నర్సీపట్నంలోనే చిన్న గుమాస్తా ఉద్యోగంలో చేరాడు. లంచాలకి దూరంగా, నిజాయితీకి దగ్గరగా బ్రతికాడు. చాలీచాలని జీతంతో గుట్టుగా సంసారం చేసేవారు. వెంగమాంబ కాపాయం వల్ల పిల్లలిద్దరికీ చదువు చెప్పించగలిగాడు. అప్పట్లో డొనేషన్లు లేవు కాబట్టి ఒకడు ఇంజనీరింగులో మరొకరిని మెడిసన్ లో చేర్పించాడు. వారిద్దరు తెలివైన పిల్లలు. బాగా చదువుకునే వారు. ఇంజనీరింగ్ లో చేరినవాడు మొదట కమ్యూనిస్టు వెంట, ఆ తరువాత మావోయిష్టుల వెంట నక్సలైటై చివరికి ఏమయ్యాడో తెలియదు. మెడిసిన్ లో చేరిన కొడుకు చక్కగా చదివి, ప్రాక్టీస్ పెట్టి, రెండు చేతులా ఆర్జించాడు. కాని కల్కిభగవాన్ భక్తిలో పడి ప్రాక్టీసు పాడుచేసుకొని, ఉన్న ఆస్థంతా పూజలు, పునస్కారాల కోసం, ఆ భగవాను భక్తులకు కైంకర్యం చేసి వాళ్ళలో కలిసి ఎక్కడికో పోయాడు. సమాజాన్ని తూటాతో మార్చి స్వర్గం చేద్దాం అని ఒకడు బాబాల భక్తితో స్వర్గం పొందాలని మరోకొడుకు మాయల్లో పడి తల్లితండ్రిని ఒంటరి వాళ్ళని చేసిపోయారు.
భార్యాభర్తలిద్దరూ వాళ్ళకొచ్చే అతి కొద్ది పింఛన్ తో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. వెంగమాంబకి భర్తతో పదో ఏట పెళ్ళైంది. డెబ్బై ఏళ్ళ సహచర్యం. భర్త ఆరోగ్యం క్షీణిస్తూ, చనిపోతాడని తెలిసినా ఆమె నిబ్బరంగానే ఉండేది. ఎందుకంటే అతను చనిపోతే తాను బ్రతకలేదు. తాను కూడా సహజంగా అతనితో పాటే చనిపోతానన్న ధీమా ఆమెలో ఉండేది. కాని అతను చనిపోయి పదిహేను రోజులైంది. ఇంకా బ్రతికే ఉంది. వీథిలో ఉన్నవాళ్ళే చెయ్యవలసిన కర్మ అంతా చేసారు. పన్నెండో రోజుతో ఇంక తమపని అయిపోయిందని ఎవ్వరూ కనిపించలేదు.
తాను తన భర్తతోనే ఎందుకు పోలేదు? ఆలోచించింది. మనసుకేమీ తట్టడం లేదు. తన వొడిలోని చితాభస్మం పాత్రని మరోసారి తడుముకుంది.
పెంకులు రాలిపోతే డబ్బులు లేక పూరికప్పు వేయించుకొన్న ఇంటి మధ్యలో చితాభస్మం, అస్థికలు ఉన్న పాత్రని ఒడిలో పెట్టుకుని ఆమె కూర్చొని ఉంది. ఆ పాత్రని ముట్టుకొంటే వేడిగా ఉంది. అది వేసవి ఎండల వల్లో- లేక ఆత్మ చల్లబడదని భర్త చితాభస్మం వల్లో తెలియదు.
ఇంకెంతో కాలం అసహనాన్ని భరించలేకుండా ఉంది. డెబ్బైయేళ్ళుగా కలిసి బ్రతికిన వ్యక్తి, ఎన్నో అనుభవాలను పంచుకొన్న వ్యక్తి, ఆగని అనుభూతుల కెరటాల సముద్రం, అభౌతిక ప్రేమని, అతి సాధారణంగా, అందంగా ఆవిష్కరించిన ఆత్మ, ఒక్క స్పర్శకి వళ్ళంతా ఝల్లుమనిపించిన దేహం, ఒక్క చూపుతో మనసులో పువ్వుల వానని కురిపించిన ప్రియుడు, ఒక్క పిలుపుతో జీవితకాలాన్ని కనురెప్పపాటుగా నడిపించిన సహచరుడు. ఒక స్పర్శతో, ఒక నవ్వుతో, ఒక కవ్వింపుతో భౌతిక సుఖాల పరాకాష్టకు చేర్చే రసాత్మక లోకంలో విహరింపజేసిన భర్త, ఏడడుగుల బంధాన్ని డెబ్బై వసంతాల కావ్యంగా మలిచిన వ్యక్తి, తన ఆ సర్వస్వం ఈ పాత్రలో ఉంది అని తలుచుకోగానే వెంగమాంబ ఉద్వేగంతో ఆ పాత్రని కౌగలించుకొని కన్నీరు కార్చింది. ఇలా పదే పదే ప్రతీరోజూ జరుగుతుండడం చూసి ఆత్మ శాంతించాలంటే చితాభస్మాన్ని అస్థికలని గోదావరిలో కలపడమే మార్గమన్నాడు పురోహితుడు. అలా చెయ్యడానికే తాను చనిపోలేదేమో అని అనిపించింది వెంగమాంబకు. పోనీ మనసు గట్టి చేసుకొని చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చెయ్యలన్నా వెళ్ళడానికి అక్కడ కర్మకాండలకి కావలసిన డబ్బులు లేవు. ఆరోగ్యం చూస్తే ఏ మాత్రం బాగోలేదు. పైగా తనని తీసుకెళ్ళే వారెవరూ లేరు. ఎవరిని అడగాలో తెలీదు. తనతోపాటు వస్తారని నమ్మకం కూడా లేదు. అదనంగా బస్సు ఛార్జీలు పెట్టే పరిస్థితి అసలే లేదు. ఇరుగు పొరుగు చెయ్యగలిగినంత సహాయం చేసారు. ఇంకా వాళ్ళని అడగడం బాగుండదు. ఇదే స్థితిలో వారం రోజులుగా సతమతమవుతూ ఉంది వెంగమాంబ. చుట్టుప్రక్కల వాళ్ళ పిల్లలు వచ్చి కొద్ది సేపు కూర్చొని ఆమె చేత ఇంత తినిపించి వెళుతున్నారు. వాళ్ళకి ఆమె కష్టం తెలుసు. ఆమె కూడా వాళ్ళని అర్థం చేసుకుంది. తినడానికే వాళ్ళపై ఆధారపడడం వల్ల ఏమీ అడగలేకపోతోంది. కాని అంత్యేష్టి దృశ్యం ఆమె కళ్ళలో మసకగా కదలాడుతోంది.
కోటిలింగాల రేవు, రాజమండ్రి.
అస్మద్ పిత్రుః సుఖేన, పుణ్యలోకా వ్యాప్త్యర్ధం, కోటిలింగ మహాక్షేత్రే, అఖండ గోదావరీ తీరే గంగా భసి అస్థి నిమజ్జనం కరిష్యే!
అంటే -
నా మిత్రుడి సుఖంకోసం, పుణ్యలోకాలు కలగాలని కోటిలింగ మహాక్షేత్రంలో గంగనుండి వచ్చిన అఖండ గోదావరి తీరంలో అస్థికలు నిమజ్జనం చేస్తున్నాను. అని మొదలు పెట్టిన సూర్యం బ్రాహ్మడు పట్టుబట్టడం వల్ల ఓ రెండు గంటల సేపు కుమార్ గారి చితాభస్మాన్ని ఆయనకి చెయ్యవలసిన ఆఖరిదైన శోడష (పదహారవ) కర్మ జరిపాడు. పరవస్తి మనుష్యాణాం గంగాతో యేషువ తిష్ఠతి తవాత్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతీ అంటారు. దాని అర్థం ఏమంటే- ఏ మనుష్యుని యొక్క అస్థికలు గంగలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటారు అని ముగించాడు. తన చెమటలు తుడుచుకుంటూ వేదోక్త కర్మలు ముగిసాయని చెప్పాడు. సంభావనల పేరుతో పోగేసిన ధాన్యం, డబ్బు సంచిలో వేసుకున్నాడు.
“అందుచేత - అయ్యా మీరు ఇక ఈ చితాభస్మాన్ని తీసుకొని పడవలో వెళ్ళి గోదావరి మధ్యలో కలపాలి” అన్నారు అపరకర్మ చేసే పురోహితుడు. నీళ్ళలో ఉన్న పడవను చూపిస్తూ.
“అలాగే చేద్దాం” అన్నాడు సూర్యం. పడవపైపు నడుస్తూ.
“అయ్యా నాదో చిన్న మనవి.....” సంశయిస్తూ అంత్యేష్టి నిర్వహించిన పురోహితుడు అన్నాడు.
“చెప్పండి. సంశయమెందుకు?”
“అటు చూడండి. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న ముసలామెని చూపాడు. ఆమె ఎనభైఏళ్ళ పైబడ్డ వృద్దురాలు. పైగా డస్సిపోయింది. భర్త అస్థికలను గోదావరిలో నిమజ్జనం చెయ్యాలని నర్శీపట్నం నుండి ఒంటరిగా వచ్చింది. వచ్చినప్పటి నుండి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఆమెకి పిల్లలు లేరు. డబ్బులు లేవు. ఇక్కడదాకా ఎలాగో వచ్చింది. ఒంటరిగా ఎలా రాగలిగిందో ఆశ్చర్యమే. నేను అణాకాణీతో కర్మ ముగించాను. కాని నదిలో అస్థికలు కలపడానికి పడవ ఎక్కాలి. సాధారణంగా ఇందుకోసం పడవవాడు వంద రూపాయలు తీసుకొంటాడు. నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడు. మీరు ఒప్పుకొంటే ఆమెను మనతో పాటుగా అదే పడవలో తీసుకెళ్ళి ఆమె భర్త అస్థికలను కూడా ....... అంటూ ఆమె కథను వివరించాడు.
“అయ్యా! తప్పకుండా ఆమెని రమ్మనండి......”
అప్పుడే గోదావరిలో స్నానం చేసిన తడి బట్టలతో, జుత్తుతో జీవమంతా కళ్ళలో మాత్రమే మిగిలి ఉన్న ఆ ముదుసలి ఆకులు రాలి ఖాళీ కొమ్మల ప్రాచీనవృక్షంలా అనిపించింది. వణికే చేతులతో పట్టుకుని ఉన్న ఆ ఇత్తడి పాత్ర ఆమె తన సర్వస్వంగా భావిస్తున్నది.
పురోహితుని కేక విని తడబడి లేచి నిలబడే ప్రయత్నం చేసింది. అందరూ పడవ వైపు నడిచారు. పురోహితుని సహాయంతో సూర్యం, ఆ తరువాత ఆ వృద్ధురాలు కష్టంగా పడవ ఎక్కారు.
పురోహితుని మంత్రాలమధ్య పడవ వాడు వేసే తెడ్డుతో పడవ గోదావరి మధ్యకు చేరింది. తీరం నుండి దూరంగా మెల్లిగా సాగుతున్నది. ఆ వృద్ధురాలి చూపు పాత్రలో ఉన్న ఆమె భర్త అస్థికలు, చితాభస్మంపై ఉంది. ఆమె ఆ పాత్రని పట్టుకొన్న తీరు చూస్తే గుండెలకు హత్తుకున్నట్లనిపిస్తుంది. ఆ పాత్రను తన శరీరం అంతటితో స్పర్శించాలన్న భావన చెప్పకనే చెపుతున్నది.
కుమార్ గారి చితాభస్మాన్ని సూర్యం మొదట గోదావరిలో కలిపాడు. ఆ తదుపరి పురోహితుడు వృద్ధురాలిని ముందుకు తీసుకెళ్ళి ఆమె తెచ్చిన పాత్రలోని చితాభస్మాన్ని, అస్థికలను మంత్రాల మధ్య నిమజ్జనం చేయించాడు.
“ఇంతటితో ఈ నిమజ్జన కర్మ ముగిసింది” అని పురోహితుడు ఈ ఇద్దరిని చూసి అన్నాడు. “పడవ వాడివైపు తిరిగి ఒడ్డు చేర్చవోయి” అన్నాడు..
తిరిగి వస్తున్న పడవలో నిశ్శబ్ధం. గోదావరి అలల మీద వీస్తున్నది గాలి, పడవ నడిపేవాడు తెడ్డు వేస్తున్నాడు. తెడ్డు గోదావరి నీటిని తాకే సమయంలో మాత్రమే శబ్దం స్పష్టంగా వినబడుతున్నది. ఆమె ఎలాంటి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆమెలో ఒక సంతృప్తి భావన కనిపిస్తోంది.
“పిల్లలు లేరని మీరు విచారించకండి. ఈ సూర్యంగారు అమెరికాలో పిల్లలు భార్య, డబ్బు అన్నిఉన్న ఒకాయన చితాభస్మాన్ని నిమజ్జనం చెయ్యడానికి అక్కడ నుండి ఈయన ఇక్కడకు వచ్చారు.....” అని సూర్యం గురించి చెపుతూ ఆమెని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు.
మనిషి చనిపోయిన తరువాత - ఆ కుటుంబ వ్యక్తులు ఆ మనిషి చితాభస్మానికి, ఎంత గౌరవం ఇస్తారు? ఆ మనిషి ఆత్మకి, అస్థికలకు చెయ్యవలసిన అపరకర్మకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు? పుణ్యం, స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, అప్పటిదాక కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి ఒక్కసారి మాయమయిపోయి చితాభస్మంగా మిగిలితే ఆ చితాభస్మం విలువేంటి? .... ఇలాంటి ప్రశ్నలతో సూర్యం మనసంతా గందరగోళంగా మారింది.
మరణించినవారి చివరికోర్కె తీర్చడం బతికి ఉన్నవాళ్ళ మొదటి విధి కావడం ఒక మానవీయ అనుబంధం అవుతోంది.
“అమ్మా! మీ భర్తగారి షోడశకర్మని చక్కగా చేయించారు. గోదావరీ నిమజ్జనం కూడా అయ్యింది. ఈయన దయవల్ల” అని సూర్యాన్ని చూపిస్తూ “మీ భర్త ఆత్మ శాంతిస్తుంది. స్వర్గం పొందుతారు” అన్నాడు.
ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. ఇన్నేళ్ళ నా అనుభవంలో ఎంతో మందిని కలిసాను. మనిషి పుట్టుకనుండి చనిపోవడం దాకా జరగవలసిన పదిహేను కర్మలు, ఆ తరువాత ఆఖరిది అయిన ఈ షోడశకర్మతో సహ ఎన్నో కార్యక్రమాలు చేయించాను. కానీ మీ వంటి వారిని ఇప్పటిదాకా చూడలేదు. మిమ్మల్ని కలవడం నా భాగ్యం. మనిషి చనిపోయినా ఆత్మ ఉంటుందని దానిని ప్రేమించగలరని, దానితో స్నేహం చెయ్యగలమని అది వినాశనం పొందదని నమ్మిన మీ ఇద్దరూ ధర్మశాస్త్రాలలో ఆత్మ గురించి చెప్పిన దాన్ని నమ్మి, ఆచరించి అనుసరణీయులైనారు.” అని చేతులెత్తి నమస్కారం చేసాడు ఇద్దరికి.
ఆమెకు ఆ మాటలు వినబడడం లేదు. తలఎత్తి సూర్యం కళ్ళల్లోకి చూసింది. సూర్యం ఒళ్ళంతా ఒక్కసారి మూలిగింది. ఎన్నడూ కలగని ఒక వింత ప్రవాహం వళ్లంతా పాకింది. వారిద్దరి మధ్య అభౌతిక, అలౌకిక పరస్పర సంబంధానికి అది వారధి అయ్యింది.
ఆమె చూపులతోనే ఏదో చెప్పాలనుకుంది.
ఆమె వంగి అతని పాదాలకు నమస్కరించబోయింది. అతను ఆమెను తన రెండు చేతులతో పట్టుకొని వారించబోయాడు. ఆమె శరీర ప్రకంపనలు అతని చేతుల ద్వారా అతని శరీరంలో ప్రవహించాయి. రెండు కన్నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి. అతను చలించిపోయాడు. ఆమెను మరింత దగ్గరగా తీసుకొన్నాడు. బలమైన అతని చేతులకి తేలికయిన ఆమె దేహం తగిలింది. పడవ తీరంవైపు నడుస్తున్నది. పురోహితుడు, అతడినీ ఆమెనీ చూస్తు అవాక్కయ్యాడు.
పడవ మధ్యలో ఉన్న బల్లపై కూర్చుంటూ ఆమెని జాగ్రత్తగా పట్టుకొని తన ప్రక్క కూర్చొనేలా చెయ్యడానికి ఎంతో ప్రయత్నించాడు సూర్యం. ఆమె అతడి ఒళ్ళో వాలిపోయింది.
ఇదేమీ గమనించని పడవవాడు ఒడ్డుకి చేరామన్నాడు.
“పడవ ఒడ్డుకి చేరింది. కాని ఇంకా తీరాలమధ్యే ప్రవాహంగానే ఉన్నాం” సూర్యం తనలో తాను అనుకున్నాడు. “అమెరికాలో కావొచ్చు – కోటిలింగాలు కావొచ్చు. తీరాలమధ్యే ఉన్నాం”.
న్యూయార్క్:
“సూర్యంగారు మన కుమార్ గారి విషయం మీకు తెలుసు కదా!”
“అవునండి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించాను. ఇంత అకస్మాత్తుగా ఆయన పోతారనుకోలేదు”.
“మీకు ఆయిన ఎంత పరిచయమో నాకు తెలీదు. కాని ఆయిన చాలా మంచివాడండి. అందరిని కూడకట్టి మన తెలుగు వాళ్ళకి ప్రతీ ఏడాది క్రిస్మస్ డిన్నర్లు ఇస్తూండేవారు”.
“తెలుసండి రామయ్యగారు, నేను కూడా కొన్నిసార్లు వాళ్ళింట విందు చేసినవాడినే”
“మీరూ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు కదా అని ఫోను చేసాను”.
“ఏమిటో చెప్పండి”
“ఆయిన చితాభస్మం ఇండియా పంపించాలండి. పోష్టులోనా, కొరియర్ లోనా ఎలా పంపాలో మీకు ఏమైనా తెలుసా?”.
“చితాభస్మం....... అవును. ఫ్యునరల్ హోమ్ వాళ్ళు సీల్ చేసి ఇస్తారు. పోష్టాఫీసులో డెత్ సర్టిఫికెట్ చూపి రిజిష్టర్ పోష్టులో పంపవచ్చు. ఏ పోష్టాఫీసులోనైనా వెళ్ళి అడిగితే వివరాలు ఇస్తారు. నేనొకసారి చాలా ఏళ్ళ క్రిందట పంపాను. అందింది కూడా”.
“కుమార్ గారి బంధువులు హైదరాబాదులో ఉన్నారు. వాళ్ళకి పంపితే చాలుట. ఎన్ని రోజులు పడుతుందో చేరడానికి?”
“నేను విశాఖపట్నం పంపినప్పుడు 20 రోజులు పట్టింది. మరి ఇపుడు ఇంకా తక్కువ సమయం పట్టవచ్చు. హైదరాబాద్ అయితే వారం లేదా పదిరోజులు పట్టవచ్చు. ఇంకా వేగంగా చేరాలంటే ఫేడర్స్, లేదా యుడియస్ కొరియర్ వాళ్ళని అడగమనండి.”
“అవును అలాగే చెబుతాను.”
“మంచిదండీ.”
మరో అరగంటలో-
“సూర్యంగారూ! వాళ్ళకి అంత తొందరేమీ లేదుటండి”
“అయితే పోష్టాఫీసు ద్వారా పంపమనండి”
“అది సరేకానీ మీరు ఏమైనా ఇండియా వెళుతున్నారా రెండు మూడు వారాల్లో?”
“అవునండి. వచ్చేవారం వెళ్తానేమొ. ఇంకా పూర్తి నిశ్చయం కాలేదు.”
“మరింకేం. మీకు ఆ చితాభస్మం ఇస్తే మీరు వెళ్ళినపుడు తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఇవ్వగలరా?”
“సరే అలాగే”.
“చాలా థేక్సండీ! ఉదయాన్నే వాళ్ళింటికి వెళ్ళాను ఈ విషయం మాట్లాడాలని. చితాభస్మం తీసుకొని మరో గంటలో వస్తాను. మీరు ఇంట్లో ఉంటారా?”
“అలాగే”
మరోగంట తరవాత
“సూర్యంగారూ మీరు చాలా సులభంగా ఈ సమస్యని సాల్వ్ చేసారండి ఈ చితాభస్మం ఈ డబ్బాలో చక్కగా సీల్ చేసి ఇచ్చారు ఫ్యునరల్ హోమ్ వాళ్ళు. దీన్ని మీరు ఇలాగే తీసుకెళ్ళవచ్చు.”
“సరే. చితాభస్మం నాతో తీసుకెళ్ళడానికి కావలసిన ఏ కాగితాలు కావాలో చెబుతాను. ఆ కాగితాలపై వాళ్ళ అబ్బాయితో కాని ఆయన భార్యతో కాని సంతకం పెట్టించి ఆయిన డెత్ సర్టిఫికెట్ కాపీ ఒకటి కూడా ఇమ్మనండి”
“సూర్యంగారూ ఐతే మీకు కావలసిన పర్మిషన్ లెటర్ మీరే డ్రాప్ట్ చేసి మెయిల్ చెయ్యండి. వాళ్ళతో దానిపై సంతకం పెట్టించి మీకు పంపమని చెప్తాను. ఇక వెళ్తాను. చితాభస్మం మీరు తీసుకెళ్ళడం పెద్ద సహాయమండి”.
మరో గంట తర్వాత -
“సూర్యంగారూ! మీరు హైదరాబాదు వెళ్ళడం నిశ్చయం అయిందన్న మెసేజ్ చూసాను. మీరు చేరేటప్పటికి వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు వచ్చి తీసుకొంటారు. మీ ఇండియా ఫోను నెంబరు, ఫ్లైట్ నెంబరు వివరాలు అన్నీ వాళ్ళ చుట్టాలకి ఇచ్చి, వాళ్ళ చుట్టాల కాంటాక్టు ఇనఫర్మేషన్ మీకు ఇవ్వమంటాను.
మరో పావు గంట తర్వాత -
“వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు రాలేరట. హైదరాబాదులో మీరు ఎక్కడుంటారో చెపితే మర్నాడు వచ్చి తీసుకొంటారుట.”
“దాందేముంది మాడ్రయివర్ కి ఇచ్చి వాళ్లింటికే పంపుతానులెండి.”
“అది కాదండి వాళ్ళు ఈ చితాభస్మాన్ని బయట లాకర్లోనో, స్టోరేజ్ లోనో పెట్టాలనుకొంటున్నారుట.”
మీరు హైదరాబాదు చేరినతరువాత మీ దగ్గరే ఉంచుకొంటే స్టోరేజ్ విషయం నిశ్చయం అవగానే మిమ్మల్ని కలిసి తీసుకొంటామంటున్నారు. వాళ్ళకి చితాభస్మం ఇంట్లో ఉంచుకోవడం ఇష్టంలేదుట. మంచిది కాదని వారి నమ్మకమట”.
“నేను మా తమ్ముడింట్లో ఉంటానండి. మరి వాళ్లేమంటారో?”
“మరి ప్రోబ్లమేనే?”
“ప్రోబ్లెం ఏముందండి? ఇంట్లో ఉంచుకోవాలని లేకపోతే అదేరోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే సరిపోతుంది కదా?”
రామయ్య గారు రెండు క్షణాలు ఆలోచించాడు.
మరో పదినిముషాలలో -
“అలా కుదరదండి. వాళ్ళకి రిజర్వేషన్లు అంత తొందరగా దొరకవటండి. రిజర్వేషన్లు దొరికినా శలవు దొరకదటండి. కాబట్టి మిమ్మల్నే ఓ స్టోరేజ్ లోనో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరో ఉంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వీలున్నపుడు నిమజ్జనానికి వెళ్ళే ముందు దాన్ని తీసుకొని వెళతారుట.”
“అలాగా”
“అవును నిజమే. కాని నేను మా తమ్ముడింటిలో ఎలా ఉంచగలను. వాళ్ళు ఉంచుకోమంటే ఏంచేసేది. సరికదా అమెరికా నుండి వచ్చి స్టోరేజ్ లో ఓ సీలు చేసిన డబ్బా నేను పెట్టడం, ఇంకెవరో వచ్చి తీసుకోవడం చాలా రిస్క్. హైసెక్యూరిటీ ఉన్నచోట, టెర్రరిష్టుల సమస్య ఉన్న ఈ రోజులలో.”
“అవును. అదీ నిజమే”
“మరి మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి”
“పోనీ ఇవన్ని ఏర్పాటు చేసానే అనుకోండి వాళ్ళ చుట్టాలు పిత్రుకర్మలు నిర్వహించి నిమజ్జనం చేస్తారని మీకు గట్టి నమ్మకం ఉందా?”
“ఇన్ని సార్లు వెనక్కి ముందుకు వెళుతున్న సంభాషణ ద్వారా వాళ్ళకి చితా భస్మం నిమజ్జనం చెయ్యడం మీద అంత ఇంట్రస్టు ఉందనుకోను.”
“ఇంతెందుకు కుమార్ గారి కొడుకుల్లో ఎవరో ఒకరు వెళ్ళి నిమజ్జనం చెయ్యవచ్చుగా.”
“వెల్.. ఆ పాజిబిలిటీ లేదండి. అందుకే మిమ్మల్ని సలహా అడుగుతున్నాం.”
“నన్నా?”
“మీకు వీలయితేనే. మీకు ఇలాంటి పట్టింపులు లేవని మా అందరికి తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతేనే.”
“నాకు పట్టింపులు లేవు కాని, అంత ఆస్థి ఉండి, ఉద్యోగాలు చేసుకొంటూ, బాగా సంపాదిస్తున్న పిల్లలుండి.......”
“వెల్ మరి వాళ్ళకి ఆ సెంటిమెంట్ లేనట్లే కనిపిస్తున్నది.”
“ఇండియాలో చితా భస్మం నిమజ్జనం చెయ్యాలన్నది ఎవరి ఉద్దేశ్యం?”
“ఉద్దేశం కాదు. కుమార్ గారి కోరిక.” తాను దేశం కాని దేశంలో తనువు చాలిస్తే భారతదేశంలో అదీ గోదావరిలో తన అస్థికలు కలవాలని కోరేవాడు.
నిశ్శబ్దం.
“రామయ్యగారూ! కుమార్ గారి చితాభస్మం నేనే నిమజ్జనం చేస్తాను ఫరవాలేదు.”
“మీరు చేసినట్లయితే ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసినవాళ్ళవుతారు. కుమార్ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఎంత ఖర్చు అయితే అంతా ఇస్తామంటున్నారు వాళ్ళు నాకూ ఒక బ్లాంక్ చెక్ కూడా సంతకం పెట్టి ఇచ్చారు మీకు ఇమ్మని.”
“నాకు ఖర్చు ఇవ్వఖ్ఖర్లేదు. కుమార్ గారు నాకూ స్నేహితులే!”
“అలా కాదు. మీరు ఖర్చు తీసుకోవాలి. చితాభస్మం నిమజ్జనం చేసిన ఫలితం పుణ్యం ఏమైనా ఉంటే అది వాళ్ళ కుటుంబానికి, కొడుకులకి దక్కాలి కదా. అందుకని.”
“హమ్మయ్య నెలరోజుల నుండి గుండెల మీద ఉన్న భారం తీరింది. కుమార్ గారి చితాభస్మం సవ్యంగా మీ చేతులమీద గోదావరిలో నిమజ్జనం అయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది.” నిట్టూర్చాడు రామయ్యగారు.
***
నర్సీపట్నం
తన మరణం తరువాత చితాభస్మం అస్థికలను తనవాళ్ళు కాశీలోనో, గోదావరిలోనో కలపుతారని అప్పుడే తనకు శాంతి చేకూరుతుందని వెంకటశాస్త్రిగారు అనుకునేవారు. కాని ఆర్థిక పరిస్థితి రానురాను క్షీణిస్తుంటే ఆ కోరికను భార్య వెంగమాంబతో బాహాటంగా అనలేక పోయేవాడు. కాని అంత్యక్రియలప్పుడు పురోహితుడు అస్థికలను గోదావరిలో కలపాలని చెప్పినప్పటి నుండి శాస్త్రిగారి కోర్కె వెంగమాంబగారిని చుట్టుముట్టింది.
వెంగమాంబ ఎనభైఏళ్ళ వృద్దురాలు. ఆమె భర్త చనిపోయి పదిహేను రోజులైంది. వారికి పెద్దగా ఆస్థిలేదు. గుమస్తాగా పనిచేసిన భర్త గాంధేయవాది.. జీవితం అంతా గాంధీ మార్గంలోనే నడిచిన వాడు. సత్యాగ్రహ కాలంలో జైళ్ళలో ఉన్నాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని చదువు పాడుచేసుకొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సొంత ఊరు నర్సీపట్నంలోనే చిన్న గుమాస్తా ఉద్యోగంలో చేరాడు. లంచాలకి దూరంగా, నిజాయితీకి దగ్గరగా బ్రతికాడు. చాలీచాలని జీతంతో గుట్టుగా సంసారం చేసేవారు. వెంగమాంబ కాపాయం వల్ల పిల్లలిద్దరికీ చదువు చెప్పించగలిగాడు. అప్పట్లో డొనేషన్లు లేవు కాబట్టి ఒకడు ఇంజనీరింగులో మరొకరిని మెడిసన్ లో చేర్పించాడు. వారిద్దరు తెలివైన పిల్లలు. బాగా చదువుకునే వారు. ఇంజనీరింగ్ లో చేరినవాడు మొదట కమ్యూనిస్టు వెంట, ఆ తరువాత మావోయిష్టుల వెంట నక్సలైటై చివరికి ఏమయ్యాడో తెలియదు. మెడిసిన్ లో చేరిన కొడుకు చక్కగా చదివి, ప్రాక్టీస్ పెట్టి, రెండు చేతులా ఆర్జించాడు. కాని కల్కిభగవాన్ భక్తిలో పడి ప్రాక్టీసు పాడుచేసుకొని, ఉన్న ఆస్థంతా పూజలు, పునస్కారాల కోసం, ఆ భగవాను భక్తులకు కైంకర్యం చేసి వాళ్ళలో కలిసి ఎక్కడికో పోయాడు. సమాజాన్ని తూటాతో మార్చి స్వర్గం చేద్దాం అని ఒకడు బాబాల భక్తితో స్వర్గం పొందాలని మరోకొడుకు మాయల్లో పడి తల్లితండ్రిని ఒంటరి వాళ్ళని చేసిపోయారు.
భార్యాభర్తలిద్దరూ వాళ్ళకొచ్చే అతి కొద్ది పింఛన్ తో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. వెంగమాంబకి భర్తతో పదో ఏట పెళ్ళైంది. డెబ్బై ఏళ్ళ సహచర్యం. భర్త ఆరోగ్యం క్షీణిస్తూ, చనిపోతాడని తెలిసినా ఆమె నిబ్బరంగానే ఉండేది. ఎందుకంటే అతను చనిపోతే తాను బ్రతకలేదు. తాను కూడా సహజంగా అతనితో పాటే చనిపోతానన్న ధీమా ఆమెలో ఉండేది. కాని అతను చనిపోయి పదిహేను రోజులైంది. ఇంకా బ్రతికే ఉంది. వీథిలో ఉన్నవాళ్ళే చెయ్యవలసిన కర్మ అంతా చేసారు. పన్నెండో రోజుతో ఇంక తమపని అయిపోయిందని ఎవ్వరూ కనిపించలేదు.
తాను తన భర్తతోనే ఎందుకు పోలేదు? ఆలోచించింది. మనసుకేమీ తట్టడం లేదు. తన వొడిలోని చితాభస్మం పాత్రని మరోసారి తడుముకుంది.
పెంకులు రాలిపోతే డబ్బులు లేక పూరికప్పు వేయించుకొన్న ఇంటి మధ్యలో చితాభస్మం, అస్థికలు ఉన్న పాత్రని ఒడిలో పెట్టుకుని ఆమె కూర్చొని ఉంది. ఆ పాత్రని ముట్టుకొంటే వేడిగా ఉంది. అది వేసవి ఎండల వల్లో- లేక ఆత్మ చల్లబడదని భర్త చితాభస్మం వల్లో తెలియదు.
ఇంకెంతో కాలం అసహనాన్ని భరించలేకుండా ఉంది. డెబ్బైయేళ్ళుగా కలిసి బ్రతికిన వ్యక్తి, ఎన్నో అనుభవాలను పంచుకొన్న వ్యక్తి, ఆగని అనుభూతుల కెరటాల సముద్రం, అభౌతిక ప్రేమని, అతి సాధారణంగా, అందంగా ఆవిష్కరించిన ఆత్మ, ఒక్క స్పర్శకి వళ్ళంతా ఝల్లుమనిపించిన దేహం, ఒక్క చూపుతో మనసులో పువ్వుల వానని కురిపించిన ప్రియుడు, ఒక్క పిలుపుతో జీవితకాలాన్ని కనురెప్పపాటుగా నడిపించిన సహచరుడు. ఒక స్పర్శతో, ఒక నవ్వుతో, ఒక కవ్వింపుతో భౌతిక సుఖాల పరాకాష్టకు చేర్చే రసాత్మక లోకంలో విహరింపజేసిన భర్త, ఏడడుగుల బంధాన్ని డెబ్బై వసంతాల కావ్యంగా మలిచిన వ్యక్తి, తన ఆ సర్వస్వం ఈ పాత్రలో ఉంది అని తలుచుకోగానే వెంగమాంబ ఉద్వేగంతో ఆ పాత్రని కౌగలించుకొని కన్నీరు కార్చింది. ఇలా పదే పదే ప్రతీరోజూ జరుగుతుండడం చూసి ఆత్మ శాంతించాలంటే చితాభస్మాన్ని అస్థికలని గోదావరిలో కలపడమే మార్గమన్నాడు పురోహితుడు. అలా చెయ్యడానికే తాను చనిపోలేదేమో అని అనిపించింది వెంగమాంబకు. పోనీ మనసు గట్టి చేసుకొని చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చెయ్యలన్నా వెళ్ళడానికి అక్కడ కర్మకాండలకి కావలసిన డబ్బులు లేవు. ఆరోగ్యం చూస్తే ఏ మాత్రం బాగోలేదు. పైగా తనని తీసుకెళ్ళే వారెవరూ లేరు. ఎవరిని అడగాలో తెలీదు. తనతోపాటు వస్తారని నమ్మకం కూడా లేదు. అదనంగా బస్సు ఛార్జీలు పెట్టే పరిస్థితి అసలే లేదు. ఇరుగు పొరుగు చెయ్యగలిగినంత సహాయం చేసారు. ఇంకా వాళ్ళని అడగడం బాగుండదు. ఇదే స్థితిలో వారం రోజులుగా సతమతమవుతూ ఉంది వెంగమాంబ. చుట్టుప్రక్కల వాళ్ళ పిల్లలు వచ్చి కొద్ది సేపు కూర్చొని ఆమె చేత ఇంత తినిపించి వెళుతున్నారు. వాళ్ళకి ఆమె కష్టం తెలుసు. ఆమె కూడా వాళ్ళని అర్థం చేసుకుంది. తినడానికే వాళ్ళపై ఆధారపడడం వల్ల ఏమీ అడగలేకపోతోంది. కాని అంత్యేష్టి దృశ్యం ఆమె కళ్ళలో మసకగా కదలాడుతోంది.
కోటిలింగాల రేవు, రాజమండ్రి.
అస్మద్ పిత్రుః సుఖేన, పుణ్యలోకా వ్యాప్త్యర్ధం, కోటిలింగ మహాక్షేత్రే, అఖండ గోదావరీ తీరే గంగా భసి అస్థి నిమజ్జనం కరిష్యే!
అంటే -
నా మిత్రుడి సుఖంకోసం, పుణ్యలోకాలు కలగాలని కోటిలింగ మహాక్షేత్రంలో గంగనుండి వచ్చిన అఖండ గోదావరి తీరంలో అస్థికలు నిమజ్జనం చేస్తున్నాను. అని మొదలు పెట్టిన సూర్యం బ్రాహ్మడు పట్టుబట్టడం వల్ల ఓ రెండు గంటల సేపు కుమార్ గారి చితాభస్మాన్ని ఆయనకి చెయ్యవలసిన ఆఖరిదైన శోడష (పదహారవ) కర్మ జరిపాడు. పరవస్తి మనుష్యాణాం గంగాతో యేషువ తిష్ఠతి తవాత్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతీ అంటారు. దాని అర్థం ఏమంటే- ఏ మనుష్యుని యొక్క అస్థికలు గంగలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటారు అని ముగించాడు. తన చెమటలు తుడుచుకుంటూ వేదోక్త కర్మలు ముగిసాయని చెప్పాడు. సంభావనల పేరుతో పోగేసిన ధాన్యం, డబ్బు సంచిలో వేసుకున్నాడు.
“అందుచేత - అయ్యా మీరు ఇక ఈ చితాభస్మాన్ని తీసుకొని పడవలో వెళ్ళి గోదావరి మధ్యలో కలపాలి” అన్నారు అపరకర్మ చేసే పురోహితుడు. నీళ్ళలో ఉన్న పడవను చూపిస్తూ.
“అలాగే చేద్దాం” అన్నాడు సూర్యం. పడవపైపు నడుస్తూ.
“అయ్యా నాదో చిన్న మనవి.....” సంశయిస్తూ అంత్యేష్టి నిర్వహించిన పురోహితుడు అన్నాడు.
“చెప్పండి. సంశయమెందుకు?”
“అటు చూడండి. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న ముసలామెని చూపాడు. ఆమె ఎనభైఏళ్ళ పైబడ్డ వృద్దురాలు. పైగా డస్సిపోయింది. భర్త అస్థికలను గోదావరిలో నిమజ్జనం చెయ్యాలని నర్శీపట్నం నుండి ఒంటరిగా వచ్చింది. వచ్చినప్పటి నుండి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఆమెకి పిల్లలు లేరు. డబ్బులు లేవు. ఇక్కడదాకా ఎలాగో వచ్చింది. ఒంటరిగా ఎలా రాగలిగిందో ఆశ్చర్యమే. నేను అణాకాణీతో కర్మ ముగించాను. కాని నదిలో అస్థికలు కలపడానికి పడవ ఎక్కాలి. సాధారణంగా ఇందుకోసం పడవవాడు వంద రూపాయలు తీసుకొంటాడు. నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడు. మీరు ఒప్పుకొంటే ఆమెను మనతో పాటుగా అదే పడవలో తీసుకెళ్ళి ఆమె భర్త అస్థికలను కూడా ....... అంటూ ఆమె కథను వివరించాడు.
“అయ్యా! తప్పకుండా ఆమెని రమ్మనండి......”
అప్పుడే గోదావరిలో స్నానం చేసిన తడి బట్టలతో, జుత్తుతో జీవమంతా కళ్ళలో మాత్రమే మిగిలి ఉన్న ఆ ముదుసలి ఆకులు రాలి ఖాళీ కొమ్మల ప్రాచీనవృక్షంలా అనిపించింది. వణికే చేతులతో పట్టుకుని ఉన్న ఆ ఇత్తడి పాత్ర ఆమె తన సర్వస్వంగా భావిస్తున్నది.
పురోహితుని కేక విని తడబడి లేచి నిలబడే ప్రయత్నం చేసింది. అందరూ పడవ వైపు నడిచారు. పురోహితుని సహాయంతో సూర్యం, ఆ తరువాత ఆ వృద్ధురాలు కష్టంగా పడవ ఎక్కారు.
పురోహితుని మంత్రాలమధ్య పడవ వాడు వేసే తెడ్డుతో పడవ గోదావరి మధ్యకు చేరింది. తీరం నుండి దూరంగా మెల్లిగా సాగుతున్నది. ఆ వృద్ధురాలి చూపు పాత్రలో ఉన్న ఆమె భర్త అస్థికలు, చితాభస్మంపై ఉంది. ఆమె ఆ పాత్రని పట్టుకొన్న తీరు చూస్తే గుండెలకు హత్తుకున్నట్లనిపిస్తుంది. ఆ పాత్రను తన శరీరం అంతటితో స్పర్శించాలన్న భావన చెప్పకనే చెపుతున్నది.
కుమార్ గారి చితాభస్మాన్ని సూర్యం మొదట గోదావరిలో కలిపాడు. ఆ తదుపరి పురోహితుడు వృద్ధురాలిని ముందుకు తీసుకెళ్ళి ఆమె తెచ్చిన పాత్రలోని చితాభస్మాన్ని, అస్థికలను మంత్రాల మధ్య నిమజ్జనం చేయించాడు.
“ఇంతటితో ఈ నిమజ్జన కర్మ ముగిసింది” అని పురోహితుడు ఈ ఇద్దరిని చూసి అన్నాడు. “పడవ వాడివైపు తిరిగి ఒడ్డు చేర్చవోయి” అన్నాడు..
తిరిగి వస్తున్న పడవలో నిశ్శబ్ధం. గోదావరి అలల మీద వీస్తున్నది గాలి, పడవ నడిపేవాడు తెడ్డు వేస్తున్నాడు. తెడ్డు గోదావరి నీటిని తాకే సమయంలో మాత్రమే శబ్దం స్పష్టంగా వినబడుతున్నది. ఆమె ఎలాంటి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆమెలో ఒక సంతృప్తి భావన కనిపిస్తోంది.
“పిల్లలు లేరని మీరు విచారించకండి. ఈ సూర్యంగారు అమెరికాలో పిల్లలు భార్య, డబ్బు అన్నిఉన్న ఒకాయన చితాభస్మాన్ని నిమజ్జనం చెయ్యడానికి అక్కడ నుండి ఈయన ఇక్కడకు వచ్చారు.....” అని సూర్యం గురించి చెపుతూ ఆమెని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు.
మనిషి చనిపోయిన తరువాత - ఆ కుటుంబ వ్యక్తులు ఆ మనిషి చితాభస్మానికి, ఎంత గౌరవం ఇస్తారు? ఆ మనిషి ఆత్మకి, అస్థికలకు చెయ్యవలసిన అపరకర్మకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు? పుణ్యం, స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, అప్పటిదాక కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి ఒక్కసారి మాయమయిపోయి చితాభస్మంగా మిగిలితే ఆ చితాభస్మం విలువేంటి? .... ఇలాంటి ప్రశ్నలతో సూర్యం మనసంతా గందరగోళంగా మారింది.
మరణించినవారి చివరికోర్కె తీర్చడం బతికి ఉన్నవాళ్ళ మొదటి విధి కావడం ఒక మానవీయ అనుబంధం అవుతోంది.
“అమ్మా! మీ భర్తగారి షోడశకర్మని చక్కగా చేయించారు. గోదావరీ నిమజ్జనం కూడా అయ్యింది. ఈయన దయవల్ల” అని సూర్యాన్ని చూపిస్తూ “మీ భర్త ఆత్మ శాంతిస్తుంది. స్వర్గం పొందుతారు” అన్నాడు.
ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. ఇన్నేళ్ళ నా అనుభవంలో ఎంతో మందిని కలిసాను. మనిషి పుట్టుకనుండి చనిపోవడం దాకా జరగవలసిన పదిహేను కర్మలు, ఆ తరువాత ఆఖరిది అయిన ఈ షోడశకర్మతో సహ ఎన్నో కార్యక్రమాలు చేయించాను. కానీ మీ వంటి వారిని ఇప్పటిదాకా చూడలేదు. మిమ్మల్ని కలవడం నా భాగ్యం. మనిషి చనిపోయినా ఆత్మ ఉంటుందని దానిని ప్రేమించగలరని, దానితో స్నేహం చెయ్యగలమని అది వినాశనం పొందదని నమ్మిన మీ ఇద్దరూ ధర్మశాస్త్రాలలో ఆత్మ గురించి చెప్పిన దాన్ని నమ్మి, ఆచరించి అనుసరణీయులైనారు.” అని చేతులెత్తి నమస్కారం చేసాడు ఇద్దరికి.
ఆమెకు ఆ మాటలు వినబడడం లేదు. తలఎత్తి సూర్యం కళ్ళల్లోకి చూసింది. సూర్యం ఒళ్ళంతా ఒక్కసారి మూలిగింది. ఎన్నడూ కలగని ఒక వింత ప్రవాహం వళ్లంతా పాకింది. వారిద్దరి మధ్య అభౌతిక, అలౌకిక పరస్పర సంబంధానికి అది వారధి అయ్యింది.
ఆమె చూపులతోనే ఏదో చెప్పాలనుకుంది.
ఆమె వంగి అతని పాదాలకు నమస్కరించబోయింది. అతను ఆమెను తన రెండు చేతులతో పట్టుకొని వారించబోయాడు. ఆమె శరీర ప్రకంపనలు అతని చేతుల ద్వారా అతని శరీరంలో ప్రవహించాయి. రెండు కన్నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి. అతను చలించిపోయాడు. ఆమెను మరింత దగ్గరగా తీసుకొన్నాడు. బలమైన అతని చేతులకి తేలికయిన ఆమె దేహం తగిలింది. పడవ తీరంవైపు నడుస్తున్నది. పురోహితుడు, అతడినీ ఆమెనీ చూస్తు అవాక్కయ్యాడు.
పడవ మధ్యలో ఉన్న బల్లపై కూర్చుంటూ ఆమెని జాగ్రత్తగా పట్టుకొని తన ప్రక్క కూర్చొనేలా చెయ్యడానికి ఎంతో ప్రయత్నించాడు సూర్యం. ఆమె అతడి ఒళ్ళో వాలిపోయింది.
ఇదేమీ గమనించని పడవవాడు ఒడ్డుకి చేరామన్నాడు.
“పడవ ఒడ్డుకి చేరింది. కాని ఇంకా తీరాలమధ్యే ప్రవాహంగానే ఉన్నాం” సూర్యం తనలో తాను అనుకున్నాడు. “అమెరికాలో కావొచ్చు – కోటిలింగాలు కావొచ్చు. తీరాలమధ్యే ఉన్నాం”.
0 వ్యాఖ్యలు:
Post a Comment