Wednesday, August 19, 2009

హచ్...!

Wednesday, August 19, 2009
దేముడికి కష్టం వచ్చింది.
దేముడి పూర్తి పేరు భుజంగ దేవర.
ఆయన తన నియోజక వర్గంలోని ప్రజలకు దేవుడే. దేవుడంటే ఎపుడూ వరాలు ఇచ్చేవాడే కాదు. ‘దుష్ట శిక్షణ’ చేసేవాడు కూడా. పాపులు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో భుజంగదేవర ఆలియాస్ దేవుడు గారు శిక్షించదనికే అవతారమెత్తిన దేవుడు. అయితే ఆయన ఎక్కువకాలం హైదరాబాదు, డిల్లీలో ఉండి ‘ప్రజాసేవ’ చేస్తుంటారు. కాబట్టి ఆయన నమ్మినబంటులు ప్రజలను శక్తివంచన లేకుండా శిక్షిస్తూంటారు. ఇప్పుడుదాకా దేవుడుగారు ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే. ఆయన గత చాలాఏళ్ళుగా ఆనియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన ఎన్నికల్లో ‘ప్రజాసేవకోసం’, ‘ప్రజలకోరికపై’ ‘ప్రజలబాగుకై’నిలబడుతూ ఉంటారు అందుకే ఆయన ఎపుడూ ఓడిపోరు.

ఎంత కలికాలం అయనా భరతఖండంలో రాను రాను ‘ప్రజాసేవ’ చెయ్యాలన్న ప్రగాఢమైన కోరిక చాలా చాలామందికి పుట్టుకొస్తున్నది. బస్తాలకొద్ది డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే, ఎన్నికల్లో నిలబడి, గెలిచి ‘ప్రజాసేవ’ చెయ్యలన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయినది. దేవుడులాంటి నాయకులను ఓడించడం మాట అలా ఉంచి అసలు ఎదిరించి నిలబడడమే కష్టం. ఒకవేళ పోటీకి నిలబడ్డా ఓడిపోవడం ఖచ్చితం. అందుకే అలా జరిగింది. దేవుడుగారు గెలిచారు.

కాని ఓడిపోయిన అభ్యర్ధి అక్కడితో ఊరుకోక దేవుడిగారి మూలాలు వెతికాడు. ఆ నియోజక వర్గం ఎస్టీలకు కేటాయించబడింది. దేవుడు ఎస్టీ. ఓడిపోయిన అభ్యర్ధి తీగలాగడంవల్ల దేవుడు గారు ఎస్టీ కాదని తేలింది. కోర్టు ఓ నాలుగేళ్ళ తరువాత తీర్పు ఇచ్చింది. దేవుడుగారి ఎలక్షన్ చెల్లదని అందుకే దేవుడు మాజి ఎమ్మెల్యే గారు అయ్యారు. దొంగ ఎస్టీ సర్టిఫికెట్ పెట్టినందుకు ఆయన్ని ఎవరూ శిక్షించలేదు. ఎందుకంటే ఆ నియోజక వర్గంలో ఎవరినైనా ‘శిక్షించేది’ ఆయన కాబట్టి. ఇప్పుడు ఆయన ఎస్టీ కాదని తేలింది. కాబట్టి రాబోయిన ఎన్నికల్లో నిలబడడానికి వీలుకాదు. అది దేవుడికి ఇప్పుడు వచ్చిన కష్టం.

వంగరాణి దేవుడి నియోజక వర్గంలో ఒక సామాన్య స్త్రీ. ఆమె భర్త చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటూ ఏదో కొంత సంపాదించుకుంటాడు. ఆ సంపాదనని అతి జాగ్రత్తగా పొదుపుగా ఖర్చుపెడుతూ తమ వీధిలోకెల్లా బాగా ఉన్నవాళ్ళు అనిపించేలా సంసారం నడుపుకొస్తున్నది. ఆమెలాంటి వాళ్ళు దేవుడి నియోజక వర్గంలో చాలామంది ఉండవచ్చు కాని ఆమెకో ప్రత్యేకత ఉంది. ఆమె తండ్రిడి నిజమైన ఎస్టీ కులం.. ఆమె తల్లి కులం బిసి. ఆమె తండ్రి ఎస్టీ అన్న విషయం ఎక్కడో రికార్డులలో తప్ప ఎవరికి తెలియదు. అది తెలుసుకొన్నారు దేముడు మనుషులు. తండ్రి ఎస్టీ కాబట్టి వంగరాణి ఎస్టీ. అంచేత ఆమె పోటీ చెయ్యడానికి అర్హురాలు అని నిశ్చయించి, ఆమె భర్తను వొప్పించి, చచ్చిపోయిన ఆమె తండ్రిని చాలా గొప్పవాడిని చేసి వంగ రాణిని దేముడిగారి అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబెట్టారు.

దేవుడిగారి మీద కోర్టులో విజయం సాధించిన వ్యక్తికి టికెట్టు ఇస్తే ఈ మారు తమ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుందని అపోజిషన్ పార్టీ నిశ్చయించింది. అతనికి టికెట్టు ఇచ్చింది. అతని పేరు వీరభద్ర దొర. అతను నిజంగానే ఎస్టీ. ఎస్టీ రిజర్వేషన్ మీద చదువుకొన్నాడు. మిగిలిన ఎస్టీలను మొదలైన వాళ్ళని కూడగట్టుకొని గిరిజన వనరుల వ్యాపారంలో మంచి సంపాదన కలిగి ఉన్నవాడు. ఒకస్థాయి సంపాదన దాటిన తరవాత అధికారం, ఆ అధికారం వల్ల వచ్చే ఎన్నోరెట్ల సంపాదన మీద ఆశ మళ్ళకంలాంటి కారణాలవల్ల వీరభద్ర దొర అతి సౌమ్యుడుగా కనిపిస్తాడు. మంచి వ్యాపారవేత్త, వ్యవహారకర్త కూడా కాబట్టి రాజకీయాలలో రాణించడం పెద్ద కష్టం కాలేదు. కాకపోతే ఒక్క దేవుడిని ఓడించడం అతని వల్ల కాలేదు. ఈ మారూ దేవుడు నిలబెట్టిన వంగరాణిని ఓడించడం కష్టం కాదనుకొన్నాడు. అయినా సరే తను ఖర్చు పెట్టవలసిన డబ్బు జాగ్రత్త చేసుకొన్నాడు. తను దేవుడిది దొంగ ఎస్టీ సర్టిఫికెట్ అని కోర్టులో నిరూపించడం ద్వారా కూడా తనకు అనుకూలంగా పనిచేస్తుందనుకొన్నాడు. అతను ఊహించింది ఒకటైతే జనం మధ్యే జరిగింది మరొకటి.

‘దొంగ’ సర్టిఫికెట్ విషయంలో వివరాలు సగం తెలిసి సగం తెలియక మాట్లాడుకొనే జనం ఇతనిని ‘దొంగ దొర’ అనడం మొదలుపెట్టారు. ఆకతాయిలు ‘దొంగ దొర’ ‘వంగరాణి’ అని గోడలమీద రాసారు. అలా ఈ మారు ఎన్నికల్లో ‘దొంగ దొర’ ‘వంగరాణి’ పోటీలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారాలు భారీగా సాగుతున్నాయి. వంగరాణిని ప్రతీరోజూ ఉదయం దేవుడి మనుషులు ఇంటికివచ్చి కారులో ప్రచారానికి తీసుకొని వెళుతున్నారు. ఆరోజు కూడా వంగరాణి తన మనుషులతో ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నది రావలసిన కారు కోసం.

వంగరాణి అత్తగారు ఇవేవి పట్టనట్టు ఇంటి ముందు ఉన్న అరుగుమీద చోడి గింజలు ఎండ బెట్టుకొంటున్నది. అరుగుకు ఆనుకొని ఉన్న పిట్టగోడ మీద ఒక కోడి నిలబడి చోడిగింజల వైపు ఆశగా చూస్తున్నది. కాని వంగరాణి అత్తగారి చేతిలోని కర్ర వైపుకూడా చూస్తున్నది. ఆమె చూపు చోడిగింజల నుండి మళ్ళి వెళ్ళబోతున్న కోడలివైపు తిరిగింది. ఆ అదును చూసుకొని కోడి చోడిగింజల పైకి దూకబోయింది. సరిగ్గా అదే సమయానికి అత్తగారి ముక్కుమీద ఓ సీతాకోకచిలుక వాలింది. దాని ప్రభావం వల్ల అత్తగారికి గట్టి తుమ్ము వచ్చింది. ఆమె తుమ్ము అకస్మాత్తుగా రావడం వల్ల పిట్టగోడ మీద నుండి కిందికి దూకుతున్న కోడి గాబరా పడి రోడ్డుపైపు ఎగిరింది. ఎగురుతూ వస్తున్న కోడిని ఆఖరిక్షణంలో చూసిన ఒక మోటర్ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి దాన్నుండి తప్పించుకొనే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న కారును గుద్దాడు. మోటర్ సైకిల్ మనిషి కింద పడ్డాడు. కారు మరోవైపునకు తిరిగి ప్రక్కనే ఉన్న రోడ్డు గుంతలో పడి ముందుకు వెళ్ళి కాల్వలో ముందు చక్రం పడ్డంవల్ల బురదలో కూరుకు పోయింది.

మోటర్ సైకిల్ మనిషిని అందరూ గట్టిగా తిట్టారు. అతని తప్పేమీ లేదని వంగరాణి చెప్పడంతో అతన్ని వదిలేసారు.

కారు నుండి దిగిన కామయ్యసెట్టిని వంగరాణి పరామర్శించింది. కారు డ్రైవర్ కి కాని కామయ్యసెట్టికి కాని పెద్దగా దెబ్బలు తగలలేదు. ఎంత ప్రయత్నించినా కాలవలో పడ్డ కారు మాత్రం బయటకు రాలేదు. బయటకు తియ్యడానికి మనుషుల్ని పిల్చుకొస్తానని డ్రైవర్ వెళ్ళాడు. కామయ్యసెట్టి, వంగరాణి కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇక్కడ జరిగింది పెద్ద ఏక్సిడెంట్ కాకపోయినా ఎవరూ కంప్లయింట్ ఇవ్వకపోయినా దారినపోతూ చూసి ఓ సైకిల్ కుర్రాడు ముందు జంక్షన్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసుకు చెప్పాడు.

ట్రాఫిక్ పోలీసు పరుగు పరుగున వచ్చి వివరాలడిగాడు. కామయ్యశెట్టి, వంగరాణి ఆ ట్రాఫిక్ పోటీసును పట్టించుకోకుండా వెళ్ళిపొమ్మని కసిరారు. ట్రాఫిక్ పోలీసుకు కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్ కి ఫోను చేసి ఎస్సైకి ఈ విషయం చెప్పాడు. రాష్ట్రం అంతా ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు పోలీసులు కార్లు చెక్ చేసి డబ్బులు పట్టుకొంటున్నారు. వారంరోజులైనా తనకి అలాంటి కేసొక్కటీ తగలలేదని నిరాశలో ఉన్న ఎస్సైకి ఇదో మంచి అవకాశం అనిపించింది. అందులోను ఓ వ్యాపారస్థుడు, ఓ రాజకీయ వ్యక్తి కలగలసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక మతలబు ఉండాలి అని హుటా హుటిన వచ్చాడు. కారు చెక్ చేస్తానన్నాడు.

' నీకు మతికాని పోయిందా ‘నాను ఏపారం చేసుకొనేవాడిని నాకు ఈ రాజకీయాలు తెలవవు’ అన్నాడు కామయ్యశెట్టి.
అయినా సరే నా డ్యూటీ నాది అని ఎస్సై కారు తనిఖీ చేసాడు. నిజంగానే ఆకారులో లక్షరూపాయిల కేష్ దొరికింది. ఎస్సై మహదానందంతో ఆ డబ్బు తీసుకొని కామయ్య శెట్టిని కోర్టుకు రమ్మన్నాడు. తమ వ్యాపారానికి ఇంతకన్నా ఎక్కువ డబ్బే రోజూ కారులో తీసుకెళతానని ఎంత వాదించినా వినలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడిపోయిన వంగ రాణి నోరు విప్పలేదు. కామయ్యశెట్టిని తీసుకొని ఎస్సై పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు.

కామయ్య శెట్టి వంగ రాణికి ఎలక్షన్ లో పంచడానికి కేష్ ఇస్తూ దొరికిపోయాడని ఊరంతా గుప్పుమంది. దేవుడికి ఈ విషయం తెలిసి వెంటనే వంగరాణిని రప్పించి విషయం అడిగారు. నిజం చెప్పమని బెదిరించారు. ఆ డబ్బుతో నాకేమీ సంబంధం లేదని గట్టిగా చెప్పింది. కామయ్య శెట్టి కూడా అదే చెప్తున్నాడని అంది. దేముడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్సైతో అదే చెప్పాడు. మాకు ఈ డబ్బుతో సంబంధం లేదు అని. అయితే రసీదు రాసిస్తాను తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్ళమని ఎస్సై అన్నాడు. తన ఖాతాలో ఒక బోణి ఎలక్షన్ కేసు రాసుకున్నాడు ఎస్సై.

ఈ విషయం ఇటు ప్రజలలో అటు దేవుడి మనసులో కల్లోలం రేపింది. ‘ఇప్పట్నించే డబ్బులిచ్చేస్తున్నారుట’ అని ప్రజలు, ‘డబ్బులివ్వడంలో మనం చాలా జాగ్రత్తపడాలి’ అని దేముడు గట్టిగా అనుకపన్నారు.
‘దొంగదొర’ అమ్మె ఇప్పటినుండే ఏంచేస్తున్నారా? అని ఆశ్చర్యపడి పోయాడు. కాని తనుకూడా ఇప్పటినుండి పంచడానికి కావలసినంత డబ్బు లేదని భాదపడ్డాడు. పోన్లే వాళ్లని ఇప్పటి నుండే పంచనీ నేను చివరిలో పంచుతానులే అని అనుకొన్నాడు.
దేవుడు తన మనుషులని పిలిచి ఇచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా పైకి తెలియకుండా తాపీగా పంచమని ఆజ్ఞలు జారీ చేసాడు. గెలిచేది ‘వంగ రాణి’ కాని ఆజ్ఞ ఇచ్చేది దేముడు. కింద పనిచేసేవాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు ఇంక ఎప్పటికీ ఇక్కడ పోటీ చెయ్యలేడు కాబట్టి పదవి ఉన్న నాయకుడు కాలేడు అని నిశ్చయించుకున్నారు. ఇతన్ని అంటిపెట్టుకొని ఇన్నేళ్ళు ఉన్నందుకు ఎక్కువగా ఏమీ మిగలలేదు. నియోజక వర్గంలో ఒక్కో అభ్యర్థికి కోటిపైనే ఖర్చు దాటిందని ఆనోట ఈనోట ఆపేపర్లో, ఈ పేపర్లో విన్నారు దేవుడి మనుషులు. తమకి పంచమని ఇచ్చిన లక్ష పూర్తిగా పంచకపోతే? అన్న ప్రశ్న ఉదయించింది అతని కింద మనుషులలో. అదికూడా చాలా జాగ్రత్తగా పంచమన్నాడు కదా మరి జాగ్రత్తగా పంచడం అంటే పైకి తెలియకుండా జరగాలి కదా ఇందులో సగం నొక్కేస్తేనో అన్న ఆలోచన కూడా వారిలో మొదలైంది.
- - -
ఎలక్షన్ ప్రచారం సాగుతున్నది. అభ్యర్థులకు డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతున్నాది. దేవుడే వంగరాణి తరఫున ఖర్చంతా పెడుతున్నాడు. వంగరాణి జాకీ బొమ్మలా అతని వెంట తిరుగుతున్నది. దేవుడి మనుషులు మొదటిసారి ఇచ్చిన డబ్బులో సగం దాచుకొని మిగతాది ఖర్చుపెట్టారు. ప్రచారం జోరులో దేవుడు అంతగా పట్టించుకోలేదు. రాను రాను దేవుడి మనుషులు పంచమని ఇచ్చినదానిలో పదో వంతు మాత్రమే పంచి మిగిలింది దాచేసుకున్నారు.
అంతా దొంగ సొమ్ము. ‘దొంగల తల్లికి ఏడవ భయం’ అన్న సామెతలా దేవుడికి కొద్ది కొద్దిగా తెలిసినా ఎన్నికలు అవ్వనీ వీళ్ళ పని పడతానని మనసులో అనుకుని ఎవరితోనూ గొడవ పడలేదు.
- - -
ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. వంగరాణి ఓడిపోయింది. దేవుడు ఢీలాపడిపోయాడు. తన రాజకీయ జీవితానికి తెర దిగినట్లుగా భాదపడ్డాడు. అసలు ఎందుకిలా జరిగిందని విచారించాడు. నిదానంగా విషయం పూర్తిగా తెలుసుకొంటే కనీసం రాబోయే కాలంలో మరో ఎత్తు వెయ్యొచ్చు అని అనుకొన్నాడు. తన క్రింద పనిచేసిన వాళ్ళు డబ్బు పంచకపోవడం వల్లే తన అభ్యర్థి వంగరాణి విషయం గ్రహించేడు.
కారణాలను వెతికాడు. తెలిసుకొన్నాడు. ఈ డబ్బు వ్యవహారానికంతటికి మూలకారణం కామయ్యశెట్టి, వంగరాణి మంతనాలు అని అనుకొన్నాడు. వంగరాణిని పిలిపించాడు. వివరంగా వాళ్లిద్దరి మధ్య ఆనాడు జరిగిన విషయం చెప్పమన్నాడు. వంగరాణి భయపడి, భోరుమని ఏడ్చి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని ఇలా మొదలుపెట్టింది. తన అత్తగారి ముక్కుమీద సీతాకోకచిలుక వాలడం ఆమె ‘హచ్...’ అని తుమ్మడం దానివల్ల కోడి భయపడి ఎగిరి మోటర్ సైకిల్ వాడిపై పడడం వాడు వెళ్ళి కారుని గుద్దడం, కారు చక్రం వెళ్ళి కాలవలో పడ్డం, పోలీసు రావడం, పోలీస్ స్టేషన్ లో దేవుడు వచ్చి సర్ది చెప్పడం దాకా అంతా వివరంగా చెప్పింది మళ్ళీ.
అయితే ఆ సీతాకోక చిలక వంగరాణి అత్తగారి ముక్కుమీద వాలకపోతే, ఆమె ‘హచ్....’ అని తుమ్మకపోతే, కోడి గాభరాపడి ఎగిరి మోటర్ సైకిల్ వాడిపై పడకపోతే, వాడు కారు గుద్దకపోతే, కారు వెళ్ళి కాలవలో పడకపోతే, పోలీసు రాకుంటే ఈ డబ్బు గొడవ జరిగుండేది కాదు కదా! అని వాపోయాడు. ముక్కుమీద తన రెక్కాడించిన సీతాకోకచిలుకని తన నియోజకవర్గంలో నిషేధించాలని భావించాడు. ఏమనుకున్నారో ఏమోగాని అప్పటినుండి దేవుడు తన ముందు ఎవరూ ‘హచ్.....’ అని తుమ్మడానికి వీలులేదని శాసించాడు.



0 వ్యాఖ్యలు: